ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్కు టీమిండియా రెడీ అవుతోంది. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిస్తే సిరీస్ భారత్ వశం అవుతుంది. దానికితోడు సౌతాఫ్రికాలో జరిగే టీ20 సిరీసులో కూడా భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించారు. కాబట్టి ఈ సిరీసు గెలవడం సూర్యకు మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది.
అందుకే ఎలాగైనా ఈ మ్యాచులో గెలిచి, ఇక్కడే సిరీస్ తమ ఖాతాలో వేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఇప్పుడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం గురించి బయటకు వచ్చిన వార్త ఫ్యాన్స్కు షాకిస్తోంది. ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్ను జనరేటర్ల సాయంతో నిర్వహించబోతున్నారట. ఎందుకంటే ఈ స్టేడియానికి ఎలక్ట్రిక్ కనెక్షన్ కట్ చేసేశారు.

దీని వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. ఈ స్టేడియం మేనేజ్మెంట్ ఏకంగా 2009 నుంచి ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేదట. దీంతో విద్యుత్ శాఖ ఈ స్టేడియానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసేసింది. దీంతో ఐదేళ్లుగా ఎలక్ట్రిసిటీ లేకుండానే ఈ స్టేడియం పనులు సాగుతున్నాయి. ఇప్పుడు సడెన్గా మ్యాచ్ నిర్వహించాల్సి రావడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను ఛత్తీస్గఢ్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు కలిశారట.
కనీసం తాత్కాలిక కనెక్షన్ అయినా ఇవ్వాలని క్రికెట్ అసోసియేషన్ కోరగా.. విద్యుత్ శాఖ సిబ్బంది సుముఖంగా స్పందించారట. అయితే కేవలం ప్రేక్షకుల గ్యాలరీలు, బాక్సులకు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తామని తేల్చిచెప్పేశారట. అయితే ఈ తాత్కాలిక కనెక్షన్ పవర్ను 200 కిలోవాట్స్ నుంచి వెయ్యి కిలో వాట్స్కు పెంచాలని, అప్పుడే ఫ్లడ్ లైట్లను ఉపయోగించగలుగుతామని మ్యాచ్ నిర్వాహకులు కోరారట.
దీనికి విద్యుత్ శాఖ అంగీకరించింది కానీ.. ఆ పనులు ఇంకా సాగుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇంకా ఫ్లడ్ లైట్ల కనెక్షన్ పనులు మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. ఈ కారణంగా మ్యాచ్ ఆగిపోతుందా? లేక ఆలస్యం అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు.