ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో చాలా సింపుల్ క్యాచ్ నేలపాలైంది. భారత జట్టులో మంచి ఫీల్డర్లలో ఒకడిగా పేరున్న శ్రేయాస్ అయ్యర్.. తన చేతుల్లోకి వచ్చిన క్యాచ్ను జారవిడిచాడు. అది కూడా ప్రమాదకరమైన డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ కావడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు టీంకు అయ్యర్ వల్ల యూజ్ ఏంటని నిలదీస్తున్నారు.
ఈ మ్యాచులో బంతితో భారత్కు షమీ మంచి ఆరంభం ఇచ్చాడు. ఫామ్లో ఉన్న మిచెల్ మార్ష్ (4)ను షమీ అవుట్ చేశాడు. ఈ ఒత్తిడిని కొనసాగించడానికి భారత బౌలర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పరుగులు తీయడానికి ఆసీస్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో శార్దూల్ ఠాకూర్ బంతి అందుకున్నాడు.

శార్దూల్ వేసిన లెంగ్త్ బాల్ను మిడాఫ్ మీదుగా వార్నర్ పుష్ చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్కు ఛాతీ ఎత్తులో సింపుల్ క్యాచ్ వచ్చింది. దీన్ని అందుకోవడంలో అయ్యర్ తడబడ్డాడు. చేతుల్లోకి వచ్చిన బంతిని జారవిడిచాడు. ఆ తర్వాత వార్నర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. అయ్యర్ను తిట్టిపోస్తున్నారు.
వార్నర్ వంటి డేంజర్ బ్యాటర్ అంత ఈజీ క్యాచ్ ఇస్తే ఎలా వదిలేస్తావ్? అని నిలదీస్తున్నారు. ఇంత కన్నా చెత్త ఫీల్డర్ను ఎక్కడా చూడలేదంటున్నారు. బ్యాటుతో అయ్యర్ పెద్దగా ఆడటం లేదు. ఇక ఫీల్డింగ్ కూడా చేయకపోతే టీంలో తను ఎందుకు? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
వెన్నుగాయంతో కొంతకాలంగా అయ్యర్ ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ముందు జట్టులో రీఎంట్రీ ఇచ్చిన అతను ఆసియా కప్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచులో కూడా కేవలం 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు.
ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీసులో రాణిస్తే వరల్డ్ కప్లో అతని స్థానం పదిలం అవుతుందని అంతా అనుకుంటున్నారు. అంత ముఖ్యమైన మ్యాచులో తనకు వచ్చిన ఈజీ క్యాచ్ను అయ్యర్ నేలపాలు చేశాడు. దీని వల్ల టీంలో అతని స్థానంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతాయని ఫ్యాన్స్ అంటున్నారు.