వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను సడెన్గా వన్డే టీంలోకి తీసుకోవడంపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. 2018 నుంచి కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడిన అతన్ని వరల్డ్ కప్లో ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇలా తనపై ఎన్ని ప్రశ్నలు కుమ్మరించినా కూడా అశ్విన్ మాత్రం తన కమిట్మెంట్తో సమాధానం ఇస్తున్నాడు.
ఆసియా కప్లో అక్షర్ పటేల్ గాయపడటంతో అతని స్థానంలో అశ్విన్ను తీసుకోవాలని సెలెక్టర్లు భావించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీసు కోసం అశ్విన్ను ఎంపిక చేశారు. వీటిలో తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరిగింది. ఈ మ్యాచులో అశ్విన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

అయితే బంతితో ఫర్వాలేదనిపించిన అతను.. బ్యాటింగ్కు సహకరించే పిచ్పై 10 ఓవర్లలో కేవలం 47 పరుగులే ఇచ్చి, కీలకమైన లబుషేన్ వికెట్ తీసుకున్నాడు. అంతేకాదు, తను జట్టులో ఉండాలంటే బ్యాటింగ్లో కూడా రాణించాలని అతనికి తెలుసు. అందుకే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినా కూడా తను చేయాల్సిన పనిని మార్చుకోలేదీ వెటరన్ స్పిన్నర్.
మ్యాచ్ ముగిసిన వెంటనే సెంటర్ పిచ్లలో ఒకదానిపై నెట్ కట్టించి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అశ్విన్ కోసం ఫీల్డింగ్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీవీల్లో ఈ సీన్ చూసిన చాలా మంది అశ్విన్ కమిట్మెంట్ను తెగ మెచ్చుకున్నారు.
ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మార్క్ వా కూడా అశ్విన్ను కొనియాడాడు. వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కాలంటే బ్యాటింగ్ కూడా ముఖ్యమని అశ్విన్కు తెలుసు. ప్రస్తుతం ద్రావిడ్, రోహిత్ జోడీ కేవలం బౌలర్లే కాకుండా.. బ్యాటుతో కూడా జట్టును ఆదుకునే వారిపై ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అశ్విన్ తన బ్యాటింగ్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఇలా తనను తిరిగి వన్డేల్లో తీసుకుంటున్నారని తెలియగానే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అశ్విన్ తన ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఒక స్థానిక లీగ్ మ్యాచులో ఆడాడు. ఆ మ్యాచులో కూడా బ్యాటింగ్ చేశాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఏం చేయడానికైనా తను సిద్ధమేనని గట్టి మెసేజ్ పంపాడు.