ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీసును భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొహాలీ, ఇండోర్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో కంఫర్టబుల్గా గెలిచిన టీమిండియా.. రాజ్కోట్లో జరిగిన మూడో వన్డేలో చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏకంగా 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శ్రేయాస్ అయ్యర్ ఫర్వాలేదనిపించాడు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో టీమిండియా ఈ టార్గెట్ను ఛేజ్ చేయలేకపోయింది. వన్డేల్లో నెంబర్ వన్ టీంగా వరల్డ్ కప్లో అడుగు పెడుతున్న భారత్కు ఇది కచ్చితంగా ఎదురు దెబ్బే అని చెప్పాలి.

అయితే స్వదేశంలో ఇంత భారీ స్కోరు ఛేజ్ చేయాల్సి రావడం భారత్కు చాలా అరుదు. భారత్ కనీసం 300 పైచిలుకు టార్గెట్ ఛేజ్ చేయాల్సి వచ్చి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. చివరగా 2019 డిసెంబరు 22న వెస్టిండీస్తో జరిగిన మ్యాచులో భారత్ ముందు 300 పైచిలుకు టార్గెట్ నిలిచింది. బారబతీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.
అప్పటికి మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఇక ఆ మ్యాచులో నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఆ జట్టు 315 పరుగులు చేసింది. ఈ ఛేజ్లో భారత్కు అదిరే ఆరంభం లభించింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్కు 122 పరుగులు జోడించారు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (7), రిషభ్ పంత్ (7), కేదార్ జాదవ్ (9) దారుణంగా విఫలమయ్యారు. అయితే విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటంతో 85 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్కు 58 పరుగులు జోడించాడీ మాజీ కెప్టెన్. చివర్లో శార్దూల్ ఠాకూర్ కూడా భారీ షాట్లు ఆడటంతో భారత్ ఈ మ్యాచ్ గెలిచింది.
ఇక ఆ తర్వాత మళ్లీ 300పైగా టార్గెట్ను ఛేజ్ చేయాల్సిన అవసరం భారత్కు రాలేదు. ఒకవేళ వచ్చినా కోహ్లీ, రోహిత్ వంటి బ్యాటింగ్ గ్రేట్స్ ఉన్న టీం ఈజీగా ఛేజ్ చేసేస్తుందని అంతా అనుకున్నారు. వారికి ఆసీస్తో జరిగిన వన్డే ఒక విధంగా కనువిప్పు అని చెప్పాలి. కేవలం వీళ్లిద్దరి మీదనే ఆధారపడితే భారత్ వరల్డ్ కప్ నెగ్గడం చాలా కష్టం.