ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటింగ్ విభాగం తేలిపోయింది. రాజ్కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా 66 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. గాయం నుంచి తిరిగొచ్చి తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్.. బ్యాటుతో తేలిపోయినా, బంతితో చెలరేగాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
స్పెషలిస్టు ఓపెనర్ లేని టీంలో వాషింగ్టన్ సుందర్తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే వాషింగ్టన్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తం 30 బంతుల్లో కేవలం 18 పరుగులే చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో అవుటయ్యాడు. రోహిత్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా చూడచక్కని షాట్లతో రాణించాడు.

రోహిత్పై ఒత్తిడి తగ్గించేందుకు తను బౌండరీల కోసం ప్రయత్నించాడు. అయితే మ్యాక్స్వెల్ బౌలింగ్లో స్ట్రెయిట్ షాట్ ఆడబోయిన రోహిత్ అవుటయ్యాడు. మ్యాక్స్వెల్ అందుకున్న షాకింగ్ క్యాచ్తో అతను పెవిలియన్ చేరాడు. దీంతో ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీపై పడింది.
అప్పటికే భారత్ చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోతోంది. దీంతో ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. మ్యాక్స్వెల్ బౌలింగ్లో బౌండరీలకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మ్యాక్సీ వేసిన బంతిని పుల్ చేయబోగా.. ఎడ్జ్ తీసుకున్న బంతిని స్టీవ్ స్మిత్ పట్టేశాడు. దీంతో కోహ్లీ కూడా అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. శ్రేయాస్ అయ్యర్ (48) ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్ (26) పెద్దగా ఆకట్టుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ (8) కీలకమైన సమయంలో విఫలమయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా (35) పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక చివర్లో ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో భారత బ్యాటర్లు తేలిపోయారు.
మ్యాక్స్వెల్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. జోష్ హాజిల్వుడ్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసుకున్నారు. దీంతో భారత జట్టు 49.4 ఓవర్లలో కేవలం 286 పరుగులే చేయగలిగింది. భారత్ను 66 పరుగులతో ఆసీస్ ఓడించింది. అయితే ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఈ సిరీసును తమ ఖాతాలో వేసుకుంది.