వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇలాంటి సమయంలో వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ టీ20లకు దూరమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరి టీ20 కెరీర్పై మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా టీ20 క్రికెట్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్లే అని నెహ్రా అన్నాడు. ఆసీస్తో టీ20 సిరీసులో కూడా వీళ్లిద్దరూ ఆడటం లేదు. దీనిపై నెహ్రా స్పందించాడు. 'విరాట్ కోహ్లీ ఒక సంవత్సరంలో 800 పరుగులు, ఒక సంవత్సరంలో వెయ్యి పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆడుతున్న విధానం చూస్తే.. సెలెక్టర్లు కూడా అతన్ని ఆడించాలని టెంప్ట్ అవుతారు' అని చెప్పాడు.

'అయితే కోహ్లీ, రోహిత్ ఇద్దరితో వారు ఆడతారా? లేదా? అని మాత్రం సెలెక్టర్లు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్లు విశ్రాంతి తీసుకుంటామని అంటే ఒప్పుకుంటారు' అని నెహ్రా వివరించాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే తప్ప వాళ్లు ఏ ఫార్మాట్ అయినా ఆడగల సమర్ధులేనని కితాబిచ్చాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ అంత త్వరగా రిటైర్మెంట్ ఇవ్వకూడదనే కోరుకుంటున్నానని చెప్పాడు.
'రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా ఏ ఫార్మాట్ అయినా ఆడగల సత్తా ఉన్న వాళ్లే. పరుగులు చేస్తూ, సంతోషంగా ఉన్నంత కాలం వాళ్లు ఆడగలరు' అని నెహ్రా వివరించాడు. విరాట్, రోహిత్ ఇద్దరూ కూడా పొట్టి ఫార్మాట్లో చాలా అద్భుతమైన రికార్డు సృష్టించిన వాళ్లే. ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లీ సూపర్గా ఆడాడు. 14 మ్యాచుల్లో రెండు సెంచరీలతో 639 పరుగులు చేశాడు.
ఇక వన్డే వరల్డ్ కప్లో రోహిత్ ఆటతీరు చూసిన ఎవరైనా సరే అతన్ని టీ20లో ఆడించాలని కోరుకుంటారు. ఎందుకంటే పవర్ ప్లేలో రోహిత్ ఎంత విధ్వంసం సృష్టించాడో అందరూ చూశారు. అందుకే అతన్ని టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.