ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో బ్యాటుతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ చెలరేగారు. దీంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత జట్టు ఈజీగా ఛేదించేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లో రెండు వరుస రనౌట్లు మ్యాచ్ను థ్రిల్లింగ్గా మార్చేశాయి. ఈ మ్యాచులో భారత బౌలింగ్ విభాగం తడబడిందనే చెప్పాలి.
అందుకే ఆసీస్ జట్టు అంత భారీ స్కోరు చేసింది. అయితే మిగతా బౌలర్లు అందరూ పేలవంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో ముఖేష్ కుమార్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పిన్ పాయింట్ యార్కర్లతో ఆసీస్ దూకుడుకు కళ్లెం వేశాడు. ఆవేష్ ఖాన్ను కాదని తనను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమే అని నిరూపించుకున్నాడు.

తోటి పేసర్లు అర్షదీప్ 10పైగా ఎకానమీతో, ప్రసిద్ధ్ కృష్ణ 12పైగా ఎకానమీతో పరుగులు ఇస్తే.... తను మాత్రం కేవలం 7.25 ఎకానమీతోనే బౌలింగ్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. అతని బౌలింగ్ను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా కొనియాడాడు. ముఖేష్ ఒక మెషీన్లా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు. ముఖ్యంగా అతని యార్కర్లు అద్భుతంగా ఉన్నాయన్నాడు.
'ఈ మ్యాచు మొత్తంలో బెస్ట్ బౌలర్ ఎవరంటే ముఖేష్ కుమార్ అనే చెప్పాలి. ఏడు బంతులు వేసిన చివరి ఓవర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చాడతను. దానిలో ఒక నోబాల్, ఫ్రీహిట్ కూడా ఉండటం మర్చిపోకూడదు. తను వరుస పెట్టి యార్కర్లు వేసిన విధానం సూపర్. ఏదో మెషీన్ వేసినట్లుగా యార్కర్ల మీద యార్కర్లు విసిరాడు' అని కొనియాడాడు.
'తనకు కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో అతని బౌలింగ్కు స్వింగ్ కూడా దక్కలేదు. ఈ కారణంగానే ముఖేష్ వికెట్లు తీయలేకపోయాడు. బ్యాటర్లు సెట్ అయిన తర్వాత బంతి ఇచ్చినా కూడా.. ఆ కష్టమైన ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముందు బౌలింగ్ చేసే మ్యాచుల్లో 20వ ఓవర్ కన్నా కూడా 19వ ఓవరే ముఖ్యం. ఆ ఓవర్ను ముఖేష్ సూపర్గా వేశాడు' అని చోప్రా మెచ్చుకున్నాడు.