INDvsAUS: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓటమి పాలైంది. భారీ స్కోరు చేసినా కూడా దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. గువాహతి వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్లో ఆసీస్కు ట్రావిస్ హెడ్ మంచి ఆరంభం అందించాడు.
కానీ వెంటనే పుంజుకున్న బౌలర్లు వెంట వెంటనే మూడు వికెట్లు తీసి ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ కేవలం 48 బంతుల్లోనే 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటి చేత్తో ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో అతని ఆటతీరును మెచ్చుకుంటూనే టీమిండియా చేసిన తప్పును మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా ఎత్తి చూపాడు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బౌలర్లను సరిగా ఉపయోగించుకోలేకపోయాడని, అందుకే భారత్ ఓడిపోయిందని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచులో 18, 20వ ఓవర్లను ప్రసిధ్ధ కృష్ణకు ఇవ్వడం, అలాగే 19వ ఓవర్ను స్పిన్నర్ అక్షర్ పటేల్ చేత వేయించడాన్ని చోప్రా తప్పుబట్టాడు. ఇక్కడే సూర్య కెప్టెన్సీలో తడబడ్డాడని చెప్పాడు.
'అక్షర్ పటేల్ 19వ ఓవర్ వేశాడు. ప్రసిద్ధ్ భారీగా పరుగులు ఇచ్చినా కూడా 18, 20వ ఓవర్లు వేశాడు. అంతేకానీ, ఆరో బౌలర్ ఆప్షన్ను భారత్ ఉపయోగించుకోలేదు. ప్రసిద్ధ్ తను వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 68 పరుగులు ఇచ్చాడు. అయినా సరే ఆరో బౌలర్ ఆప్షన్ తీసుకోకుండా అతని చేతనే బౌలింగ్ చేయించారు' అని చోప్రా గుర్తుచేశాడు.

'అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతని ఓవర్లు ఆపి చివర్లో 19వ ఓవర్ వేయించారు. అసలు అతన్ని ఎందుకు అలా ఆపారో నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఆరో బౌలర్ను ఉపయోగించుకోకపోవడం, స్పిన్నర్తో 19వ ఓవర్ వేయించడం చాలా పెద్ద మిస్టేక్. అదే టైంలో 18, 20వ ఓవర్లను ప్రసిద్ధ్ కృష్ణకు ఇచ్చారు. అతను బాదించుకున్నాడు' అని వివరించాడు.