పుణె: మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజైన శనివారం ఉదయం భారత్ శుభారంభం చేసింది. భారత పేసర్లు మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్లు చెలరేగడంతో.. ఆట ప్రారంభమైన అరగంటలోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో పర్యాటక దక్షిణాఫ్రికా ఇప్పటికే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మిథాలీ రాజ్ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం!!
ఓవర్నైట్ స్కోర్ 36/3తో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ భారత పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. మొదటగా షమీ వేసిన 18వ ఓవర్లో నోర్జె (3) స్లిప్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇక ఉమేశ్ యాదవ్ వేసిన 21వ ఓవర్లో డిబ్రుయిన్ (30) కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో మూడో రోజు ఉదయం టీమిండియా ఫాస్ట్ బౌలర్లు చెరో వికెట్ సాధించారు.
53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డుప్లెసిస్, డికాక్లు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడుపుతున్నాడు. ప్రస్తుతం 29 ఓవర్లకు దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్ (17), డికాక్ (13) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా 521 పరుగులు వెనకబడి ఉంది.
రెండో రోజు మూడో సెషన్లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. సఫారీ జట్టును ఉమేష్ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద ఓపెనర్ అయిడెన్ మార్కరమ్ను డకౌట్ చేసాడు. ఇక 13 పరుగుల వద్ద మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ (6)ను పెవిలిన్ పంపి ప్రొటీస్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. మార్క్రమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ఉమేశ్.. ఎల్గర్ను బౌల్డ్ చేశాడు. అనంతరం జట్టు స్కోరు 33 పరుగుల వద్ద షమీ.. బవుమా (8) ఔట్ చేసాడు. 15 ఓవర్లకు 36/3 గా ఉన్న సమయంలో రెండో రోజు ఆట ముగిసింది.