
హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత శక్తిమంత మహిళల్లో ఒకరిగా పేరొందిన ఇంద్రనూయి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పెప్సికో సంస్థకు ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)లో మరో కీలక పదవిని చేపట్టనున్నారు. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.
ఐసీసీ బోర్డులో ఆమెను తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమె జూన్లో ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు అందులో పేర్కొంది. ఆమె నియామకాన్ని బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్లు ఐసీసీ వెల్లడించింది.
పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో బోర్డులోకి కొత్తగా ఒక స్వతంత్ర డైరెక్టర్ను తీసుకోవాలని అది కూడా మహిళ అయి ఉండాలని 2017 జూన్లో నిర్వహించిన ఐసీసీ మండలి సమావేశంలో పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగా ఆమెను స్వతంత్ర మహిళా డైరెక్టర్గా నియమించింది.
ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వంద మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో వరుసగా ఇంద్రా నూయి చోటు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. పెప్సికో సీఈఓగా ఇంద్రానూయి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను కొత్తపుంతులు తొక్కించారు.
ప్రస్తుతం ఈ సంస్ధ నుంచి మొత్తం 22 రకాలకు చెందిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలోకి విడుదలవుతున్నాయి. పెప్సికో సంస్థ ఆదాయం ఏడాదికిగాను $1 బిలియన్గా ఉంది. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ మాట్లాడుతూ 'ఇంద్రా నూయి ఐసీసీలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. పరిపాలనలో మహిళా డైరెక్టర్ను భాగస్వామ్యం చేయబోతున్నాం. ఇదొక కీలక నిర్ణయం. ప్రపంచ వ్యాపార రంగంలో ఆమెకున్న అపార అనుభవం తమకు ఉపయోగపడుతుంది' అని ఆయన అన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.