
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు జరిగిన హోల్కర్ స్టేడియం పిచ్ రిపోర్టును ఐసీసీ మార్చింది. ఈ టెస్టు మ్యాచ్లో స్పిన్నర్లు చెలరేగారు. భారత బ్యాటర్లు కూడా స్పిన్ ముందు తల వంచాల్సి వచ్చింది. దీంతో ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. అంతేకాదు, ఈ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడం గమనార్హం. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు సారధ్యం వహించాడు.
ఈ సిరీస్లో ఆసీస్ గెలిచిన తొలి మ్యాచ్ కూడా ఇదే. అయితే ఈ మ్యాచ్లో హోల్కర్ పిచ్ చాలా భారీగా స్పిన్ అయిందని, బౌన్స్ కూడా అనూహ్యంగా కనిపించింది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఈ పిచ్పై నెగిటివ్ అభిప్రాయం కనబరిచాడు. దీనికి పూర్ రివ్యూ ఇచ్చాడు. అయితే ఇది బీసీసీఐకి ఏమాత్రం నచ్చలేదు. హోల్కర్ స్టేడియం పిచ్ అంత చెత్తగా ఏం లేదని, దీనికి పూర్ రేటింగ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడింది.
అందుకే రివ్యూ రాగానే దీనిపై అప్పీల్ చేసింది. దీన్ని స్వీకరించిన ఐసీసీ మరోసారి ఈ మ్యాచ్ వీడియో ఫుటేజిని పరిశీలించింది. ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ మెంబర్ రోజర్ హార్పర్తో కూడిన అప్పీల్ ప్యానెల్ ఈ ఫుటేజిని చూసింది. అనంతరం మ్యాచ్ రిఫరీ ఇచ్చిన రివ్యూ కరెక్ట్ కాదని భావించింది. దీంతో పూర్ రేటింగ్ మార్చి, 'బిలో యావరేజ్' రేటింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పూర్ రేటింగ్ కనుక ఇచ్చి ఉంటే హోల్కర్ స్టేడియానికి ఏకంగా మూడు డీమెరిట్ పాయింట్లు దక్కేవి.
ఇలా ఐసీసీ ఇచ్చే డీమెరిట్ పాయింట్లు ఐదు కనుక ఒక స్టేడియానికి దక్కితే ఒక ఏడాదిపాటు ఆ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం కుదరదు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో కొన్ని మ్యాచులను హోల్కర్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మెగా టోర్నీ నిర్వహించేందు షార్ట్ లిస్ట్ చేసిన స్టేడియాల్లో హోల్కర్ స్టేడియం కూడా ఒకటి. ఇలాంటి సమయంలో మూడు డీమెరిట్ పాయింట్లు దక్కడి ఈ స్టేడియానికి ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు బిలో యావరేజ్ రేటింగ్ రావడంతో కేవలం ఒక్క డీమెరిట్ పాయింట్ మాత్రమే దక్కింది.