
హైదరాబాద్: త్వరలోనే భారత్-పాకిస్తాన్ల మధ్య సంబంధాలు బలపడతాయట. అంతేకాదు, క్రమేపీ భారత్-పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు కూడా విరివిగా జరుగుతాయట. క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాకిస్థాన్..ఇంటర్నేషనల్ మ్యాచ్లలతో తలపడనున్నాయి. పాకిస్థాన్ కాబోయే ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రోద్బలంతో.. భారత్తో క్రికెట్ సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయని పాకిస్థాన్ భావిస్తోంది.
రాజకీయాల కారణంగా ఏర్పడిన భారత్, పాక్ల క్రికెట్ మధ్య దూరం ఇక నుంచి దూరంకానుంది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం మాత్రమే కాదు పాక్కు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కూడా. ప్రపంచ క్రికెట్లో ఎన్ని టోర్నీలున్నా, ఎన్ని సిరీస్లు జరిగినా.. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్లకు ఉన్న ప్రాముఖ్యతే వేరు. 2013 తర్వాత ఇండియా,పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు చూసే అదృష్టం అభిమానులకు కలగలేదు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్,పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఎంతగా ప్రయత్నించినా రాజకీయ వివాదాల కారణంగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించలేకపోయాయి. వన్డే,టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే భారత్ పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో భారత్,పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలతో పాటు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని విదేశీ వ్యవహార శాఖకు చెందిన సీనియర్ అధికారి న్యూస్ 18 నెట్వర్క్తో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఇమ్రాన్..పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు నవ్జోత్ సింగ్ సిద్ధు,సునీల్ గవాస్కర్,కపిల్ దేవ్లకు ఆహ్వానం పంపారు.26/11 ముంబై దాడుల తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. చివరిగా 2013లో భారత్తో పాకిస్థాన్ ద్వైపాక్షిక వన్డే,టీ20 సిరీస్లు ఆడింది.ఇమ్రాన్ ఖాన్ ప్రోద్బలంతో అయినా భారత్-పాక్ మధ్య మునుపటిలా క్రికెట్ సంబందాలు మెరుగైతే ఇరు దేశాల అభిమానులకు అంతకుమించి కావాల్సిందేముంటుంది.