
అహ్మదాబాద్: మొతేరా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్ (2/15), శార్దూల్ ఠాకూర్ (3/45)లు188/8కి పరిమితం చేశారు. డేవిడ్ మలన్ (68: 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (52: 34 బంతుల్లో 2 ఫోర్లు,4 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆల్రౌండ్షోతో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. సిరీస్ను ఘన విజయంతో ముగించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ మార్చి 23న ప్రారంభం కానుంది. మ్యాచులు అన్ని పూణేలో జరగనున్నాయి.
చెలరేగిన మలన్, బట్లర్:
భారీ ఛేదన ఆరంభించిన ఇంగ్లండ్కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ జేసన్ రాయ్ (0)ను భువనేశ్వర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు సాగలేదు. టీ20 నంబర్వన్ ఆటగాడు డేవిడ్ మలన్, విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, రాహుల్ చహర్ లక్ష్యంగా విజృంభించారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించారు. రెండో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యం అందించారు.
మలుపుతిప్పిన భువీ:
అర్ధ శతకాలు సాధించిన మలన్, బట్లర్ జోడీ ప్రమాదకరంగా మారారు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అనూహ్యంగా భువనేశ్వర్ చేతికి బంతినిచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫలితం రాబట్టాడు. ఆ ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేసిన భువీ.. ఐదో బంతికి బట్లర్ని ఔట్ చేశాడు. అక్కడి నుంచి ఇంగ్లండ్ ఒత్తిడిలోకి వెళ్లింది. బంతులు, పరుగుల మధ్య అంతరం పెరిగిపోవడంతో.. జానీ బెయిర్స్టో (7), డేవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్ (1), బెన్ స్టోక్స్ (14) భారీ షాట్లు ఆడబోయి ఔటైపోయారు. చివర్లో క్రిస్ జోర్దాన్ (11), శామ్ కరన్ (14 నాటౌట్) మెరుపులు.. ఇంగ్లండ్ ఓటమి అంతరాన్ని తగ్గించాయి. భారత బౌలర్లలో శార్ధూల్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ రెండు తీశాడు.
రోహిత్ దంచుడు:
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6), విరాట్ కోహ్లీ (80 నాటౌట్; 52 బంతుల్లో 7×4, 2×6) ఆకలిగొన్న పులుల్లా విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు వణికించిన పేసర్ల బౌలింగ్ను ఊచకోత కోశారు. వుడ్, ఆర్చర్, స్టోక్స్.. ఎవ్వరొచ్చినా కనికరం చూపించలేదు. ఈ క్రమంలో తొలి వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా రోహిత్.. పేసర్ల బౌలింగ్లో కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. వీరి ధాటికి 8 ఓవర్లకే స్కోరు 81కి చేరుకుంది. అయితే తర్వాతి ఓవర్లో రోహిత్ను స్టోక్స్ పెవిలియన్ పంపించాడు.
విరాట్ అర్ధ శతకం:
ఆపై సూర్య కుమార్ యాదవ్ (32; 17 బంతుల్లో 3×4, 2×6) కూడా ధాటిగా ఆడాడు. రాగానే వరుసగా రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. రెండో వికెట్కు 49 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రషీద్ వేసిన 13.2వ బంతికి భారీ షాట్ ఆడబోయిన సూర్య బౌండరీ సరిహద్దు వద్ద జోర్డాన్ చేతికి చిక్కాడు. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్; 17 బంతుల్లో 4×4, 2×6) కోహ్లీకి సహకరించాడు. 16వ ఓవర్లో విరాట్ అర్ధ శతకం బాదేశాక ఇద్దరూ జోరు పెంచారు. సిక్సర్లు, బౌండరీల మోత మోగించారు. మూడో వికెట్కు 81 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును 224కు చేర్చారు.