
మెల్బోర్న్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పైనీ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్ జట్టుతోనే ఆసీస్ బరిలోకి దిగుతోంది. మొదటి టెస్టులో ఘోర పరాభవం తర్వాత బరిలోకి దిగుతున్న భారత్ నాలుగు మార్పులతో ఆటకు సిద్ధమైంది.
పితృత్వ సెలవుల కారణంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమీ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. మొదటి టెస్టులో ఘోరంగా విఫలమైన ఓపెనర్ పృథ్వీ షా, వృద్ధిమాన్ సాహాలపై జట్టు యాజమాన్యం వేటువేసింది. దీంతో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్కు జట్టులో చోటు దక్కింది. కోహ్లీ దూరం కావడంతో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న అజింక్య రహానే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్లో సిరాజ్, గిల్ టెస్టు మ్యాచ్ల్లో ఆరంగ్రేటం చేస్తున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు. ఆస్ట్రేలియా 43 మ్యాచ్ల్లో, భారత్ 28 మ్యాచ్ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు 'డ్రా' అయ్యాయి. ఇక ఒక టెస్టు 'టై'గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడి, 12 మ్యాచ్లను 'డ్రా' చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్ల్లో ఓడింది. 15 'డ్రా' కాగా, ఒక టెస్టు 'టై' అయింది.
ఈ టెస్టు కోసం డ్రాప్ ఇన్ పిచ్ను ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్కు సమంగా అనుకూలిస్తుంది. చక్కటి బౌన్స్ కూడా ఉంది. రెండు రోజులపాటు చిరుజల్లులు పడే అవకాశం మినహా... వాతావరణం బాగుంది. టెస్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు.
తుది జట్లు:
ఆస్ట్రేలియా : జో బర్న్స్, మాథ్యూ వెడ్, మార్కస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పైనీ (కెప్టెన్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హేజిల్వుడ్.
భారత్: మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే (కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.