స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ 0-3తో కోల్పోయింది. వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ స్పిన్నర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చతికిలపడ్డారు. సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురికావడం భారత్కు ఇదే తొలిసారి.
ఈ ఘోర పరాజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియషిప్ (2023-25) పాయింట్ల పట్టికలో భారత్ తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది. 62.50 విజయశాతంలో ఆస్ట్రేలియా టాపర్గా నిలిచింది. కివీస్తో సిరీస్ ప్రారంభానికి ముందు 70+శాతంతో ఉన్న టీమిండియా ప్రస్తుతం 58.33 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ తమ గెలుపు శాతాన్ని మెరుగుపర్చుకుని 54.55%తో నాలుగో స్థానానికి ఎగబాకింది. శ్రీలంక 55.56 శాతంతో మూడో స్థానంలో ఉంది.

అయితే వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వడం భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను భారీగా దెబ్బతీసింది. ఈ క్రమంలో ఫైనల్ సినారియో క్లిష్టంగా మారింది. టీమిండియా తమ మిగిలిన మ్యాచ్ల్లో కచ్చితంగా నాలుగింట్లో విజయం సాధించాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ముచ్చటగా మూడోసారి టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరుతుంది. కాగా, భారత్ చివరి అయిదు మ్యాచ్లు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది.
గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో, 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ విజయం సాధిస్తున్నప్పటికీ కంగారూల గడ్డపై ఈసారి విజయం సాధించిడం రోహిత్ సేనకు అంతతేలికైన విషయం కాదు. మరోవైపు ఆస్ట్రేలియా ఫైనల్కు చేరాలంటే తమ చివరి ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయం సాధించాలి. ఆసీస్ టీమిండియాతో అయిదు, శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న శ్రీలంక తమ తదుపరి నాలుగు మ్యాచ్ల్లో (దక్షిణాఫ్రికాతో-2, ఆస్ట్రేలియాతో-2) గెలిచితీరాలి. న్యూజిలాండ్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయాలి.