సాధారణంగా స్పెయిన్ అంటే ఫుట్బాల్లో నెలకొల్పిన ఘనతలే అందరికీ గుర్తొస్తాయి. కానీ స్పెయిన్ క్రికెట్లో సంచలనం సృష్టించింది. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో భారత్ పేరిట ఉన్న రికార్డును పసికూన స్పెయిన్ బద్దలుకొట్టింది. ఇంతకీ ఏ రికార్డు నమోదు చేసిందంటే..
పురుషుల టీ20ల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా స్పెయిన్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్పెయిన్ వరుసగా 14 మ్యాచ్ల్లో గెలిచింది. 2022 నవంబర్ నుంచి స్పెయిన్ అప్రతిహత విజయాలతో హోరెత్తిస్తోంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ యూరప్ క్వాలిఫయిర్ గ్రూప్-సీ మ్యాచ్లో గ్రీస్ జట్టుపై విజయం సాధించి ఈ అరుదైన ఘనతలను అందుకుంది.

టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టు జాబితాలో స్పెయిన్ తర్వాతి స్థానాల్లో మలేషియా, బెర్ముడా ఉన్నాయి. ఈ రెండు జట్లు వరుసగా 13 మ్యాచ్ల్లో గెలిచాయి. 2021లో బెర్ముడా, 2022లో మలేషియా ఈ ఘనత సాధించాయి. ఇక ఐసీసీ పూర్తిస్థాయి సభ్య దేశాల్లో భారత్, అఫ్గానిస్థాన్ టాప్లో ఉన్నాయి. కాగా, ఇండియా, అఫ్గాన్ 12 మ్యాచ్ల్లోనే వరుసగా నెగ్గాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో భారత్ ఈ ఘనత సాధించింది.
అయితే పసికూన మ్యాచ్ల వల్ల ప్రపంచ రికార్డులు బద్దలవ్వడంపై మిశ్రమ స్పందన వస్తోంది. పసికూన ఫలితాలను లెక్కలోకి తీసుకోకుండా పూర్తిస్థాయి సభ్యదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని వాదన వినిపిస్తోంది. మరోవైపు స్పెయిన్ తమ సమవుజ్జీలతోనే పోరాడి గెలిచిందని మద్దతు లభిస్తోంది. కాగా, ఐల్ ఆఫ్ మ్యాన్, జెర్సీ, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, గ్రీస్ వంటి దేశాలపై స్పెయిన్ వరుస విజయాలతో సత్తాచాటింది.