వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలనే లక్ష్యంతో టీమిండియా మరో టెస్టు సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0తో గెలిస్తేనే ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. అయితే ఈ కీలక సిరీస్ ఆరంభంకాక ముందే భారత జట్టుకు పెనుసవాళ్లు ఎదురయ్యాయి.
వ్యక్తిగత, గాయాల కారణాలతో టాప్ ఆర్డర్లోని ఇద్దరు ప్రధాన ప్లేయర్లు దూరమయ్యారు. అందులో జట్టును నడిపించే రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. శుక్రవారం పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో హిట్మ్యాన్ దూరమవ్వగా, బొటనవేలు విరిగి శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండట్లేదు. అయితే ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన సారథి బాధ్యతలను స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అందుకోనున్నాడు.

కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను ఢీకొనడం అంత ఈజీ కాదు. కానీ బుమ్రా పదునైన వ్యూహాలతో జట్టును నడిపించడానికి సిద్ధమయ్యాడు. సారథిగా కంటే ఓ అత్యుత్తమ బౌలర్గా తుదిజట్టును నిర్మిస్తున్నాడు. ఓపెనర్గా రోహిత్ స్థానాన్ని అనుభవం ఉన్న కేఎల్ రాహుల్తో భర్తీచేస్తున్నాడు. ఇక వన్డౌన్లో వచ్చే శుభ్మన్ గిల్ స్థానంలో ప్రకటించిన జట్టులో లేని దేవదత్ పడిక్కల్కు అవకాశం ఇస్తున్నాడు. కమిన్స్, హేజిల్వుడ్, స్టార్క్ వంటి బౌలర్లను ఈ ఆరుడగుల ఎడమచేతి వాటం బ్యాటర్ సమర్థవంతంగా ఎదుర్కోగలడని యోచిస్తున్నాడు.
అంతేగాక ఆస్ట్రేలియా-ఏతో జరిగిన టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి పడిక్కల్ నాలుగో స్థానంలో 276 బంతులు ఎదుర్కొని 124 పరుగుల చేశాడు. దీంతో పడిక్కల్కు బుమ్రా అవకాశం ఇవ్వనున్నాడు. తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ ఖరారయ్యారు. ఆరో స్థానంలో ఫామ్లో ఉన్న ధ్రువ్ జురెల్ను బరిలోకి దించనున్నాడు. దీంతో మొత్తంగా ముగ్గరు వికెట్ కీపర్లతో బుమ్రా తుదిజట్టును సిద్ధం చేయనున్నాడు. పేస్ ఆల్రౌండర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తున్నాడు.
అయితే స్పిన్ ఆల్రౌండర్ స్థానంలో రవీంద్ర జడేజాకు బదులుగా రవిచంద్రన్ అశ్విన్కు అవకాశం ఇవ్వాలని బుమ్రా నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీలను స్పిన్ ఉచ్చులో దించడానికి యాష్ను తీసుకువస్తున్నాడు. ఇక తనతో పాటు పేస్ బాధ్యతలు మోయడానికి మహ్మద్ సిరాజ్ను ఖరారు చేశాడు. మిగిలిన ఒక్క స్థానం కోసం ఆకాశ్ దీప్ లేదా ప్రసిధ్ కృష్ణలలో ఒకరిని తీసుకోవాలని యోచిస్తున్నాడు.
తొలి టెస్టు తుదిజట్టు (అంచనా)
యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ/ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్).
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.