టీ20 వరల్డ్ కప్ విజయోత్సవ ర్యాలీ ఘనంగా ముగిసింది. ఇక టీమిండియా అభిమానులంతా తమ ఫోకస్ను జింబాబ్వే సిరీస్పై పెట్టారు. రేపటి నుంచి మొదలుకానున్న జింబాబ్వే పర్యటనలో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు అయిదు టీ20ల సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు తొలి
మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించడం, అంతేగాక జింబాబ్వే సిరీస్కు సీనియర్లంతా దూరమవ్వడంతో తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్ భారత క్రికెట్కు ఎంతో కీలకం కానుంది. కొత్త తరాన్ని సిద్ధం చేసేందుకు సెలక్టర్లు యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చారు.

భారత భవిష్యత్ క్రికెట్ను ఈ యువ ఆటగాళ్లే ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి సమవుజ్జీ కానప్పటికీ సిరీస్పై ఆసక్తి పెరిగింది. ఈ సిరీస్తో ఐపీఎల్ స్టార్లు భారత తరఫున అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు అందరూ యువకులే కావడంతో జట్టు కూర్పుపై గందరగోళం నెలకొంది. అయితే కోచ్గా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ గిల్ వ్యూహాత్మకంగా తుదిజట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్తో రుతురాజ్ గైక్వాడ్కు బదులుగా అభిషేక్ శర్మకు ఓపెనర్గా అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. గత భారత టీ20 సిరీస్ల్లో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా వచ్చాడు. కానీ కోహ్లి రిటైర్ అవ్వడంతో వన్డౌన్ బాధ్యతలు రుతురాజ్కు అప్పగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. పరిస్థితిని బట్టి రుతురాజ్ గేర్ను మార్చగలడు. దీంతో ఓపెనర్ స్థానం నుంచి రుతురాజ్ను తప్పించి వన్డౌన్లో ప్రమోట్ చేయాలని చూస్తోంది. అయితే ఓపెనర్ స్థానాన్ని ఇష్టపడే రుతురాజ్ మూడో స్థానంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం.
నాలుగో స్థానంలో రియాన్ పరాగ్ ఆడనున్నాడు. అయిదో స్థానంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ఆరో స్థానంలో నయా ఫినిషర్ రింకూ సింగ్ తుదిజట్టులోకి రానున్నారు. ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. సుందర్తో రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఇక ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ పేస్ బాధ్యతలు అందుకోనున్నారు. అయితే వరుస ప్రయాణాలు చేస్తున్న రింకూ, ఖలీల్కు విశ్రాంతి ఇవ్వాలని భావించే అవకాశమూ ఉంది.
జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుది జట్టు(అంచనా)
శుభ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.