భారత్ వర్సెస్ సౌతాఫ్రికా నాలుగు టీ20ల సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి టీ20లో భారత్ సునాయాసంగా ఘన విజయం సాధించగా, రెండో టీ20లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా సత్తాచాటింది. ఓటమి కోరల్లో నుంచి తప్పించుకుని సఫారీలు గెలుపు తీరాలకు చేరారు. ఈ నేపథ్యంలో సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20పై సర్వత్రా ఉత్కంఠ పెరిగింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
అయితే తొలి మ్యాచ్ విన్నింగ్ కాంబినేషన్ను రెండో టీ20లోనూ కొనసాగించిన టీమిండియా మేనేజ్మెంట్ మూడో మ్యాచ్లో మార్పులు చేపట్టాలని భావిస్తోంది. ఓటమి చవిచూసిన కారణంతోనే కాకుండా సిరీస్లోని చివరి రెండు మ్యాచ్లకు యువ క్రికెటర్లు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీ, కేకేఆర్ యువ రిటైన్డ్ ప్లేయర్లు యశ్ దయాల్, రమన్దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నారు.

యశ్ దయాల్ను ఆర్సీబీ రూ.5 కోట్లకు, రమన్దీప్ను కేకేఆర్ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. రమన్దీప్ పేస్ ఆల్రౌండర్, యశ్ దయాల్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్. కాగా, మూడో టీ20 జరగనున్న సెంచూరియన్ వేదిక బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 2023 మార్చిలో చివరిసారి టీ20 జరగ్గా 517 పరుగులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో హార్డ్ హిట్టర్ రమన్దీప్ తుదిజట్టులోకి వస్తే భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అక్షర్ పటేల్ స్థానంలో రమన్దీప్కు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు అర్షదీప్ సింగ్ స్థానంలో యశ్ దయాల్ జట్టులోకి రానున్నాడు.
మూడో టీ20కి భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, రమన్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, యశ్ దయాల్, అవేశ్ ఖాన్.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.