దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టీ20ల సిరీస్ను భారత్ ఘనంగా బోణీ కొట్టింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో సత్తాచాటి సఫారీలను చిత్తు చేసింది. అదే జోరులో సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లోనూ గెలవాలని టీమిండియా పట్టుదలతో సిద్ధమవుతోంది.
మరోవైపు రేపటి మ్యాచ్లో గెలిచి భారత్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేయాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే రెండో టీ20లో తుదిజట్టులో మార్పులు చేయాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ భావిస్తున్నారు. విన్నింగ్ కాంబినేషన్ మార్చడానికి ఇష్టం లేకపోయినా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో కేకేఆర్ రిటైన్డ్ ప్లేయర్, ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో అతను జట్టులోకి రానున్నాడు. తొలి టీ20లో భారత్ 202 పరుగులు భారీ స్కోరు చేసినప్పటికీ చివరి 6 ఓవర్లలో40 పరుగులే చేసింది. పేస్తో పాటు హార్డ్ హిట్టర్ రమన్దీప్ జట్టులో ఉంటే భారత్ మరింత భారీ స్కోరు చేయగలదని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.
అంతేగాక తొలి టీ20లో అక్షర్ పటేల్ను బౌలింగ్ పరంగా సూర్య ఎక్కువగా ఉపయోగించలేదు. ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్తో స్పిన్ బౌలింగ్ బలంగా ఉండటంతో రమన్దీప్కు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. రమన్దీప్ బ్యాటింగ్, బౌలింగ్తో పాటు అద్భుతమైన ఫీల్డర్. కాగా, భారత్ - దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 28 మ్యాచ్లు ఆడగా టీమిండియా 16 మ్యాచ్ల్లో, సఫారీలు 11 పోరుల్లో గెలిచాయి. అయితే సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్పై దక్షిణాఫ్రికాదే పైచేయి.
సౌతాఫ్రికాతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, రమన్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.