భారత్కు చెందిన అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్, మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మంగళవారం మరణించారు. గత 12 రోజులుగా బరోడా ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
దత్తాజీరావు గైక్వాడ్ 1952 నుంచి 1961 మధ్య టీమిండియా తరపున 11 టెస్టులు ఆడారు. అంతేగాక 1959 ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించారు. లీడ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఆయన 1961లో చెన్నైలో పాకిస్థాన్పై చివరి మ్యాచ్ ఆడారు. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు.

రంజీట్రోఫీలో దత్తాజీరావు బరోడా తరఫున ప్రాతినిథ్యం వహించారు. 1947 నుంచి 1961 వరకు ఆడారు. 36.40 సగటుతో 5788 పరుగులు చేశారు. దీనిలో 17 సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించగా మహారాష్ట్రపై ఆయన అజేయంగా చేసిన 249 పరుగులు ఆయన అత్యధిక స్కోరు. దత్తాజీరావు కెప్టెన్సీలో బరోడా 1957-58 సీజన్లో రంజీ ట్రోఫీ కూడా గెలుచుకుంది.
2016లో 87 సంవత్సరాల వయస్సులో మాజీ బ్యాటర్ దీపక్ శోధన్ మరణించిన తర్వాత భారతదేశపు అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్గా దత్తాజీరావు గైక్వాడ్ నిలిచారు. కానీ ఇవాళ ఆయన తుదిశ్వాస విడవడంతో ప్రస్తుత భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్గా మద్రాస్కు చెందిన చింగ్లెపుట్ గోపీనాథ్ ఉన్నారు. గోపీనాథ్ ప్రస్తుత వయస్సు 93 సంవత్సరాల 349 రోజులు. కాగా, దత్తాజీరావు కుమారుడు అన్షుమన్ గైక్వాడ్ కూడా టీమిండియా మాజీ క్రికెటరే.
"భారత మాజీ కెప్టెన్, భారతదేశపు అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ అయిన దత్తాజీరావు గైక్వాడ్ మరణించారు. బీసీసీఐ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన 11 టెస్టులు ఆడారు. 1959లో ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు నాయకత్వం వహించారు. ఆయన కెప్టెన్సీలో బరోడా రంజీ ట్రోఫీని గెలుచుకుంది. 1957-58 సీజన్లో ఫైనల్లో సర్వీసెస్ను బరోడా ఓడించింది. గైక్వాడ్ కుటుంబ సభ్యులకు బీసీసీఐ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోంది" అని బీసీసీఐ దత్తాజీరావు గురించి ట్వీట్ చేసింది.