ఛాంపియన్స్ ట్రోఫీకి మరి కొద్ది రోజులే సమయం మిగిలి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించబోయే జట్టుపై బీసీసీఐ సెలక్టర్లు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జనవరి 12 ఆదివారంలోగా ప్రకటించాలి. కానీ, బీసీసీఐ మాత్రం ఇంకాస్త సమయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడనుంది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఒకేసారి జట్లను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావించింది. అయితే ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. మొదట ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్కు మాత్రమే జట్టును ప్రకటించాలని ఫిక్స్ అయిందట. ఇవాళ లేదా ఆదివారం జట్టును ప్రకటించనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

ఐసీసీకి విజ్ఞప్తి చేసిన బీసీసీఐ
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాలు, ఈ మెగా ట్రోఫీ ప్రారంభానికి కనీసం నెల రోజుల ముందే తమ జట్లను ప్రకటించాలి. కానీ, ఈసారి మాత్రం ఐదు వారాల ముందే ప్రకటించి, ఆ తర్వాత మార్పులు, చేర్పులు చేసుకునే విధంగా వెసులుబాటును కల్పించింది ఐసీసీ. కానీ బీసీసీఐ మాత్రం ఇప్పుడు నెల రోజుల ముందే జట్టును ప్రకటిస్తామని ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అంటే జనవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ సిరీస్ వాళ్లే ఛాంపియన్స్ ట్రోఫీకి
ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ను టీమ్ ఇండియా స్వదేశంలో ఆడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. అయితే వన్డే సిరీస్కు తీసుకోబోయే జట్టునే ఛాంపియన్స్ ట్రోఫీకి కొనసాగిస్తారని క్రికెట్ వర్గాల విశ్లేషణ. మహా అయితే ఒకటీ లేదా రెండు మార్పులు మాత్రమే ఉండొచ్చని అంటున్నారు.