హైదరాబాద్: ఐపీఎల్ అనంతరం టీమిండియా ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. కొద్ది రోజుల విరామం అనంతరం చేయనున్న పర్యటనలో స్పిన్నర్లదే కీలక పాత్ర అని సీనియర్లతో సహా నొక్కి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ టీమిండియా స్పిన్నర్ల తమ దేశంలో అద్భుతంగా రాణిస్తారని పేర్కొన్నాడు.
టీమిండియా జులై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ని ఇంగ్లాండ్తో ఆడనుంది. ఈ పర్యటనకి సంబంధించిన జట్టుని ఇప్పటికే భారత సెలక్టర్లు ప్రకటించగా.. అందులో మణికట్లు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్లకి చోటు దక్కింది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి భారత స్పిన్నర్ల నుంచి సవాల్ ఎదురుకానుందని స్వాన్ హెచ్చరించాడు.
'మణికట్టు స్పిన్నర్లని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సమర్థంగా ఎదుర్కోలేరు. గత ఏడాది పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా.. ఆ బలహీనతని మరోసారి బయటపెట్టాడు. ఇంగ్లాండ్ పిచ్లు కొంచెం నెమ్మదిగా ఉంటాయి. దీంతో.. మణికట్టు స్పిన్నర్లు ఎదుర్కోవడానికి సాధారణంగా బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్పైకి వచ్చి హిట్టింగ్కి ప్రయత్నిస్తారు. కానీ.. గత ఏడాది యాసిర్ షా బౌలింగ్లో అలా సాధ్యంకాకపోవడంతో బ్యాక్ఫుట్పైకి వెళ్లి ఆడేందుకు ప్రయత్నించారు' అని తెలిపాడు.
'అయితే.. యాసిర్ షా మరింత తెలివిగా.. వేగవంతమైన లెగ్స్పిన్తో ఆ అవకాశమివ్వకుండా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించాడు. కాబట్టి.. భారత మణికట్టు స్పిన్నర్లు కూడా యాసిర్ షా బాటలో వెళ్తే.. మెరుగైన ఫలితాలు సాధించొచ్చు' అని గ్రేమ్ స్వాన్ వెల్లడించాడు.