
హైదరాబాద్: భారత మహిళా జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ)గా గురువారం బాధ్యతలు స్వీకరించింది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేష్ అరోరాలు హర్మన్ ప్రీత్ కౌర్ యూనిఫాంకు స్టార్లను పిన్ చేసి కొత్త బాధ్యతలు అప్పజెప్పారు.
'యంగ్ క్రికెటర్ హర్మన్ప్రీత్కు యూనిఫాంకు డీజీపీ సురేష్ ఆరోరాతో కలిసి స్టార్లను పిన్ చేసి కొత్త బాధ్యతలు అప్పజెప్పడంలో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉంది. హర్మన్ ప్రీత్ పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. హర్మన్ ప్రీత్ మాకు ఎంతో గర్వకారకంగా నిలిచింది. ఆమె ఇలానే కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నా. నా శుభాకాంక్షలు ఆమెతో ఎప్పటికీ ఉంటాయి' అని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.
గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్కు చేర్చడంలో హర్మన్ ప్రీత్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు గత జులైలో ప్రకటించింది.
పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ ప్రస్తుతం తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే ఆమెను రిలీవ్ చేసేందుకు పశ్చిమ రైల్వే నిబంధనలను సాకుగా చూపించింది. పశ్చిమ రైల్వేతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉద్యోగం చేయడానికి ఐదేళ్లపాటు ఒప్పందం చేసుకుంది.
ఉద్యోగం మానేసి వెళ్లాలనుకుంటే ఐదేళ్ల జీతం రూ. 27 లక్షలను కట్టి వెళ్లాలని పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ తేల్చి చెప్పారు. అయితే ఆమె అంత మొత్తం చెల్లించలేనని చెప్పింది. దాదాపు ఐదు నెలలుగా అటు పంజాబ్ ప్రభుత్వం నుంచి, రైల్వే నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండా ఉంది.
దీంతో ఈ విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోక్యం చేసుకుని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాస్తూ హర్మన్ సమస్యను వేరే కోణంలో చూడాలని, ఆమె రాజీనామాను ఆమోదించాలని కోరారు. స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాయడంతో ఆమె డీఎస్పీ పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది.
దీంతో పోలీసు ఉద్యోగంలో చేరేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఆమె గురువారం డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించింది.