భారత అమ్మాయిలు చెలరేగారు. మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో అద్భుతమైన ప్రదర్శన చేసింది ఇండియా-ఎ జట్టు. తమ తొలి మ్యాచ్లో హాంకాంగ్ను ఎదుర్కొన్న భారత అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
కెప్టెన్ శ్వేతా షెహ్రావత్ తమపై ఉంచిన నమ్మకాన్ని భారత బౌలర్లు నిలబెట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్ల ధాటికి హాంకాంగ్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే టిటాస్ సంధు, మన్నత్ కశ్యప్ ఇద్దరూ వికెట్లతో ఆకట్టుకున్నారు. దీంతో తడబడిన హాంకాగ్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు.

ఇక ఆ తర్వాత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ చెలరేగింది. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆమె కేవలం రెండు పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీసుకుంది. దీంతో హాంకాగ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. శ్రేయాంకతోపాటు మన్నత్ కశ్యప్ కూడా రెండు ఓవర్లలో రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకుంది. ఇలా బౌలర్లు అందరూ చెలరేగడంతో హాంకాంగ్ బ్యాటింగ్ తేలిపోయింది.
ఆ జట్టు 14 ఓవర్లలో కేవలం 34 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్య ఛేదనలో భారత అమ్మాయిలు చెలరేగారు. కేవలం ఆరు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేశారు. కెప్టెన్ శ్వేత అవుటైనా కూడా.. తెలుగమ్మాయి గొంగడి త్రిష, ఉమా ఛెత్రీ ఇద్దరూ అద్భుతంగా ఆడి జట్టుకు విజయం అందించారు. ఈ టోర్నీలో ఇండియా-ఎ అమ్మాయిలు తర్వాతి మ్యాచుల్లో థాయ్ల్యాండ్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లతో తలపడనున్నారు.
కాగా, ఈ మ్యాచ్లో చెలరేగిన శ్రేయాంక పాటిల్కు డబ్ల్యూపీఎల్తో పేరు వచ్చిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఈ ఏడాది ప్రారంభించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆమె ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించింది. చాలా మ్యాచుల్లో జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేసింది కూడా. కానీ డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ అమ్మాయిలు ఏమాత్రం రాణించలేదు. లీగ్ నుంచి మొదటగా తప్పుకున్న జట్టు ఇదే కావడం గమనార్హం.