
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇరు భారత జట్లు విజయాల పరంపరతో దూసుకుపోతున్నాయి. ఆరు వన్డేల సిరీస్ విభాగంలో పురుషుల క్రికెట్ నేడు అనగా శుక్రవారం ఆఖరుదైన ఆరో వన్డే ఆడబోతోంది. మహిళల జట్టు రెండో టీ20తో దక్షిణాఫ్రికా జట్టుపై విరుచుకుపడనుంది. ఈ రెండు జట్లకు సఫారీ గడ్డ వేదిక కానుంది.
ఆరు వన్డేల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ శుక్రవారమే. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న భారత్ 5-1తో ముగించాలని పట్టుదలగా ఉండగా.. దక్షిణాఫ్రికా గెలుపుతో ఊరట పొందాలని చూస్తోంది. మూడు టీ20ల సిరీస్ ఆదివారం ఆరంభంకానున్న నేపథ్యంలో రెండు జట్లు విజయంతో సిరీస్ను ముగించాలని కోరుకుంటున్నాయి.
జోరుమీదున్న భారత్కే మ్యాచ్లో విజయావకాశాలు ఎక్కువ అనడంలో సందేహం లేదు. ఓపెనర్ ధావన్, కోహ్లి అద్భుత ఫామ్లో ఉన్నారు. రోహిత్ కూడా ఐదో వన్డేలో సెంచరీ సాధించాడు. ఇక బౌలింగ్లో పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణిస్తున్నారు. మణికట్టు మాయగాళ్లు కుల్దీప్ యాదవ్, చాహల్ను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికాకు కత్తిమీద సాములా తయారైంది.
ఆఖరి వన్డేలో పరిస్థితి భిన్నంగా ఏం ఉండకపోవచ్చు. ఐతే.. భారత్కూ పరిష్కరించుకోవాల్సిన సమస్యలున్నాయి. జట్టులో మిడిలార్డర్ నిలకడగా విఫలమవుతోంది. మరోవైపు పేస్ దళంలో భువనేశ్వర్, బుమ్రా కొంత కాలంగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అందుకే ఈ రెండు విభాగాల్లో ప్రయోగాలకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా!
దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచి.. టీ20 సిరీస్లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో టీ20 శుక్రవారమే. జోరు కొనసాగించి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది.
తొలి మ్యాచ్లో మిథాలీ రాజ్ అర్ధసెంచరీతో చెలరేగగా.. 17 ఏళ్ల అమ్మాయి జెమీమా అరంగేట్రంలోనే ఆకట్టుకుంది. వేదా కృష్ణమూర్తి కూడా రాణించింది. వీరికి తోడు కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతి మంధాన కూడా పరుగులు సాధిస్తే భారత్కు తిరుగులేనట్లే. బౌలింగ్లో అనూజ పాటిల్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ మంచి ఫామ్లో ఉన్నారు.