
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటింగ్ విభాగం తడబడింది. ఐర్లాండ్తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ (29 బంతుల్లో 24) నిదానంగా ఆడటంతో పవర్ప్లేను భారత్ ఉపయోగించుకోలేకపోయింది. అయితే మరో ఓపెనర్ స్మృతి మంధాన (86) అద్భుతమైన పోరాట పటిమ చూపించింది. ఎక్కడా రన్ రేట్ దారుణంగా పడిపోకుండా జాగ్రత్తగా ఆడింది.
హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత ప్రతి బంతిని బౌండరీ దాటించేందుకు మంధాన ప్రయత్నించింది. అయితే ఆమెకు సరిగా సహకారం అందించే వాళ్లు కరువయ్యారు. హర్మన్ప్రీత్ కౌమర్ (20 బంతుల్లో 13) కూడా జిడ్డు బ్యాటింగ్తో చికాకు కలిగించింది. రిచా ఘోష్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరింది. దీప్తి శర్మ కూడా అదే తరహాలో గోల్డెన్ డక్గా అవుటైంది. చివర్లో పూజ వస్త్రాకర్ (2 నాటౌట్) అండగా జెమీమా రోడ్రిగెజ్ (19) కొన్ని చూడచక్కని షాట్లతో అలరించింది. చివరి బంతికి ఆమె అవుటైంది.
భారత ఇన్నింగ్స్లో షెఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరూ జిడ్డు బ్యాటింగ్తో తలనొప్పి తెప్పించారు. అయినా సరే మంధాన, రోడ్రిగెజ్ రాణించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలనీ మూడు, ఓర్లా ప్రెండర్గాస్ట్ రెండు, ఆర్లీన్ కెల్లీ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు హర్మన్ప్రీత్, షెఫాలీ వర్మపై విమర్శలు చేస్తున్నారు. వరల్డ్ కప్ సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇలా జిడ్డు బ్యాటింగ్ చేస్తారా? అంటూ మండిపడుతున్నారు. మరి భారత బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.