
హైదరాబాద్: కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 43.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
భారత మహిళల బౌలర్లలో జూలన్ గోస్వామి నాలుగు వికెట్లతో రాణించగా, శిఖా పాండే మూడు, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, గైక్వాడ్కు ఓ వికెట్ దక్కింది. దక్షిణాఫ్రికా మహిళా బ్యాట్స్ఉమెన్లలో కెప్టెన్ వాన్ నీకెర్క్ (41), లారా వోల్వార్డ్(21), మరిజన్నే కాప్(23), సునే లూస్(18)లు మినహా మిగతా ఎవరూ రాణించలేదు.
తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 214
ఐసీసీ మహిళల చాంపియన్ షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికాకు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా సోమవారం కింబర్లీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహిళా జట్టుకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పూనమ్ రౌత్ (19; 47 బంతుల్లో 2 ఫోర్లు), స్మృతి మందాన నిలకడగా ఆడుతున్న సమయంలో ఇన్నింగ్స్ 14.6వ బంతికి పూనమ్ను ఔటై పెవిలియన్కు చేరింది.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ మిథాలీ (45; 70 బంతుల్లో 2 ఫోర్ల)తో కలిసి స్మృతి మందాన (84; 98 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సు) హాఫ్ సెంచరీతో రాణించింది. అనంతరం తర్వాతి ఓవర్లో ఒక్క పరుగు తేడాతో మిథాలీ సైతం ఔట్కావడంతో భారత్ స్కోరు నెమ్మదించింది. దీంతో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీని తృటిలో చేజార్చుకుంది.
ఇన్నింగ్స్ను చక్కదిద్దాల్సిన కీలక సమయంలో స్కోరు 159 పరుగుల వద్ద వేద కృష్ణమూర్తి(2) రనౌట్ కావడంతో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. చివర్లో హర్మన్ ప్రీత్ కౌర్ (16), సుష్మ వర్మ (15) పోరాడటంతో భారత్ 213 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా మహిళా బౌలర్లలో మరిజన్నే కాప్, అయబోంగా రెండేసి వికెట్లు తీయగా, మసబట క్లాస్కు ఓ వికెట్ దక్కింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.