లీడ్స్: ప్రవాస భారతీయురాలు ఒకరు ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్ సందర్భంగా హల్చల్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని, అటు ఇటు ఊపుతూ ఆ మహిళ స్టేడియంలో హంగామా సృష్టించారు. వుయ్ హేట్ నరేంద్ర మోడీ.. అంటూ గట్టిగా నినాదాలు చేశారు. మోడీ ఓ మోసగాడు అంటూ నినదించారామె. కిందటి నెల 29వ తేదీన లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వైరల్గా మారింది.
గుజరాతీ మహిళ..
ఈ వీడియోలో ఆ మహిళ తనను తాను పరిచయం చేసుకోవడం కనిపించింది. పేరు వెల్లడించకపోయినప్పటికీ.. తాను గుజరాత్ అహ్మదాబాద్లోని జుహాపురా ప్రాంతంలో నివసిస్తున్నానని పేర్కొన్నారు. పాకిస్తాన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కూర్చన్న గ్యాలరీలో ఆమె ఇలా హంగామా చేస్తూ కనిపించారు. పాకిస్తాన్ అభిమానులతో ఆమె తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆమెతోపాటు ఇదే వీడియోలో ఇద్దరు సిక్కులు కనిపించారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులుగా వారిని అనుమానిస్తున్నారు. ఖలిస్తాన్కు జిందాబాద్ అంటూ ఆ సిక్కు వ్యక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, ఖలిస్తాన్కు సంబంధించినదిగా అనుమానిస్తోన్న జెండాను ప్రదర్శించడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
కన్నేసిన క్రైమ్బ్రాంచ్..
ఈ వీడియో వైరల్గా మారిన వెంటనే అహ్మదాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసును అహ్మదాబాద్ క్రైమ్బ్రాంచ్ విభాగం పోలీసులు టేకప్ చేశారు. జుహాపురా ప్రాంతంలో ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్కు చెందిన మహిళే అయినప్పటికీ.. ఇంగ్లండ్లో స్థిరపడి ఉండొచ్చని క్రైమ్బ్రాంచ్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై సమగ్ర సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని వెల్లడించారు. హెడింగ్లేలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ను ఓడించిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ సాగింది.