హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు వెళ్లి ఓ యువ క్రికెటర్ స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. శ్రీలంకలో జరుగుతున్న అండర్-17 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వెళ్లిన 12 ఏళ్ల గుజరాత్ లోని సూరత్కు చెందిన యువ క్రికెటర్ నరేంద్ర సోధా స్విమ్మింగ్ పూల్లో మునిగి దుర్మరణం పాలయ్యాడు.

అండర్ -17 టోర్నీలో భాగంగా 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టు లంకకు వెళ్లి అక్కడి పమునుగమలోని ఓ స్టార్ హోటల్లో బస చేశారు. శ్రీలంక మీడియా సండె టైమ్స్ తెలిపిన సమాచారం ప్రకారం.... మంగళవారం సాయంత్రం స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈత కొడుతుండగా ఒక్కసారిగా నరేంద్ర సోధా మునిగిపోయాడు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న మరో నలుగురు ఆటగాళ్లు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం అతడిని హోటల్ సిబ్బంది సహకారంతో సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రగామా టీచింగ్ హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు కూడా శ్రీలంక పర్యటనలో ఉంది.

శ్రీలంక పర్యటనకు వెళ్లిన కోహ్లీ సేన ఆ దేశంతో జరిగిన మూడు టెస్ట్లు, ఐదు వన్డేలు, ఒక్క టీ20ల్లో గెలుపొంది 9-0తో సిరీస్లను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.