కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది టీమిండియాపై కామెంట్ చేస్తూ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. తాను బాగా ఆడకపోవడం ప్రపంచకప్లలో భారత్కు కలిసొచ్చిందని పేర్కొన్నాడు. ఇటీవల ట్విటర్లో తన అభిమానులతో ముచ్చటించిన అఫ్రిదిని ఒకతను ఆసక్తికర ప్రశ్న వేశాడు. 'భాయ్ మీ మీద ఉన్న గౌరవంతో అడుగుతున్నా.. ప్రపంచకప్లలో భారత్పై ఎందుకంత ఘోరంగా విఫలమయ్యారు?. అన్ని మ్యాచ్లలో కలిపి కేవలం 56 పరుగులు చేశారు. ఇక ఒకటే వికెట్ మాత్రమే పడగొట్టారు. అందుకు కారణం ఏంటి?' అని ప్రశ్నించాడు.
అభిమాని అడిగిన ప్రశ్నకు షాహిద్ అఫ్రిదికి ఏం చెప్పాలో పాలుపోలేదు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. 'టీమిండియా లక్కీ' అనుకుంటా అని నవ్వుతున్న ఏమోజీతో రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఫ్రిది సమాధానంపై భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రతి స్పందించాలని ఓ అభిమాని జోక్ చేయగా.. పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది తన వైఫల్యాన్ని చాలా సమర్థవంతంగా కప్పిపుచ్చుకున్నాడని మరొకరు అన్నారు.
మరో భారత అభిమాని స్పందిస్తూ... 'అవును మేం అదృష్టవంతులమే. నువ్వు ఆడిన ప్రతీ మ్యాచ్ మేమే గెలిచినందుకు అదృష్టవంతులమే' అని ట్వీట్ చేశాడు. మరికొందరు అయితే ఏకంగా అఫ్రిది పలు సందర్భాల్లో డకౌట్ అయిన వీడియోలు పోస్టు చేసి ఆటపట్టించారు. అంతర్జాతీయ కెరీర్లో షాహిద్ అఫ్రిది 27 టెస్టుల్లో, 398 వన్డేల్లో, 99 టీ20 మ్యాచ్ల్లో పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేలకు పైగా రన్స్ బాదాడు.
I think Indian team was lucky 😊
— Shahid Afridi (@SAfridiOfficial) July 29, 2020
1999 నుంచి షాహిద్ అఫ్రిది ప్రపంచకప్లు ఆడుతున్నా.. ఒక్కసారి కూడా భారత్పై 22 పరుగులకు మించి చేయలేదు. తొలిసారి 6 పరుగులు చేసిన అఫ్రిది.. 2003లో 9 పరుగులే చేశాడు. అనంతరం 2011లో సెమీఫైనల్ మ్యాచ్లో కెప్టెన్గా ఉన్న అఫ్రిది ఛేదనలో 19 పరుగులే చేశాడు. ఇక 2015లో 22 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా చూస్తే పాక్ మాజీ క్రికెటర్ భారత్ చేతిలో ఘోరంగా విఫలమయ్యాడు.
టీమిండియా క్రికెటర్లకి 10 నెలలుగా జీతాల్లేవ్!!