టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కు మరో సమస్య ఎదురైంది. భారత జట్టులో కొందరు ఆటగాళ్లు గౌతమ్ గంభీర్ అభిప్రాయాలు, వ్యూహాలతో ఏకీభవించట్లేదు. ఈ విషయంపై బీసీసీఐకి ఫిర్యాదు కూడా వెళ్లింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయానికి గంభీర్ను బాధ్యుడిని చేస్తున్న తరుణంలో.. ఈ కొత్త అలజడి అతని కోచ్ పదవికే ఎసరు పెట్టేలా ఉంది. భారత జట్టుకు వైట్ బాల్-రెడ్ బాల్కు వేర్వేరుగా కోచ్లను నియమించే యోచనలో బీసీసీఐ ఉంది.
91 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. కివీస్తో టెస్టు సిరీస్ను 0-3తో కోల్పోయి ఈ అపకీర్తి మూటగట్టుకుంది. ఈ ఘోర పరాభవంపై బీసీసీఐ సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సమీక్ష నిర్వహించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా ప్రశ్నలు సంధించారు.

రెండో టెస్టులో విఫలమైనప్పటికీ మూడో టెస్టులోనూ స్పిన్ పిచ్ను ఎందుకు సిద్ధం చేశారు? ఆ మ్యాచ్లో బుమ్రాను ఎందుకు తప్పించారు? ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ప్రణాళికలు ఏంటి? అని గంభీర్-రోహిత్ను బీసీసీఐ ప్రశ్నించింది. అయితే సమీక్షతో సంబంధం లేకుండా గంభీర్పై బీసీసీఐకి భారత జట్టులోని కీలక ఆటగాళ్లు ఫిర్యాదు చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల పేర్లను పేర్కొనకుండా జట్టులోని ప్రధాన సీనియర్లు అని తెలిపాయి. జట్టు వ్యూహాల్లో గంభీర్తో విభేదాలు వస్తున్నట్లు సీనియర్లు పేర్కొన్నారని రాసుకొచ్చాయి.
కాగా, గౌతమ్ గంభీర్కు నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని బీసీసీఐ చివరి అవకాశంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించకపోతే గంభీర్ను కోచ్గా టెస్టు ఫార్మాట్ నుంచి తప్పించాలని భావిస్తోంది. గంభీర్ స్థానంలో ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమించాలని యోచిస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్లో భారత్ విఫలమైతే కోచ్తో పాటు సీనియర్ల ఆటగాళ్లపై వేటు విధించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.