
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ముగించిన భారత జట్టు సభ్యులకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. గురువారం తెల్లవారుజాము నుంచి జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా దుబాయ్ మీదుగా స్వదేశానికి వస్తున్నారు. కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వి షా ముంబైకి చేరుకున్నారు. అయితే ముంబై చేరుకున్న క్రికెటర్లందరూ తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ ఇక్బాల్ చహల్ తెలిపారు. క్రికెటర్లందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టు,హోం క్వారంటైన్ తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.
విదేశాల నుంచి ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకునే వారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్లో ఉండాలి. తొలి వారం హోటల్లో క్వారంటైన్లో ఉన్న తర్వాత.. మరో వారం హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. కానీ భారత క్రికెటర్ల కోసం ఈ నిబంధనను సడలించారు. హోం క్వారంటైన్లో మాత్రం కచ్చితంగా ఉండాలని అధికారులు సూచించారు. టీం, మేనేజ్మెంట్ సభ్యులు గురువారం ఉదయం 9 గంటలకు దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో ముంబై విమానాశ్రయంలో దిగారు.
ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. అతడు కూడా హోం క్వారంటైన్లో ఉంటాడని సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎయిర్పోర్ట్లో మీడియాలో మాట్లాడిన బ్రిస్బేన్ టెస్ట్ హీరో పంత్ అన్నాడు. సిరీస్ మొత్తం ఆడిన తీరుపై టీమ్ అంతా సంతోషంగా ఉన్నదని చెప్పాడు. పంత్ సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 97, బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 89 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
సిడ్నీ టెస్ట్ హీరో హనుమ విహారి, నాలుగో టెస్ట్లోని రెండో ఇన్నింగ్స్లో తనదైన శైలిలో బౌలింగ్ వేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్కు చెమటలు పట్టించి.. ఐదు వికెట్లు తీసిన మరో హీరో మహ్మద్ సిరాజ్లు గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. క్రికెటర్లకు అభిమానులు పుష్ప గుచ్చాలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.