'యాషెష్ కన్నా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తక్కువేం కాదు'.. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇవి. ఐసీసీ ట్రోఫీని మినహాయించి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ట్రోఫీ యాషెస్. ఈ సిరీస్ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పోరాడుతుంటుంది. అదే స్థాయిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫికీ కూడా ఇప్పుడు ప్రత్యేక ఆదరణ లభిస్తోంది.
ప్రపంచంలో తమను మించిన ప్లేయర్లు లేరని మురిసిపోయే ఆస్ట్రేలియన్లను.. వాళ్ల సొంతగడ్డపై టీమిండియా వరుసగా ఓడిస్తుండటంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి విశేష ఆదరణ పెరిగిపోతుంది. 2016 నుంచి భారత్దే ఈ సిరీస్. అయితే ఈ సారి తమ పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా పగతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది.

ఆస్ట్రేలియా పర్యటన కోసం మహ్మద్ షమిని రంగంలోకి దించుతోంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం చీలమండల గాయంతో జట్టుకు షమి దూరమైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో షమి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆస్ట్రేలియా గడ్డపైనే షమి పునరాగమనం చేయనున్నాడని బీసీసీఐ వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి.
గతంలో వన్డే వరల్డ్ కప్ ముంగిట బుమ్రాను తీసుకువచ్చినట్లుగా షమిని తిరిగి భారత జట్టులో చేర్చలేమని, టెస్టు సిరీస్ కావడంతో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ''షమి ఆటకు దూరమై చాలా కాలం గడిచింది. అతను ఆటతో సజావుగా కలిసిపోవాలి. బుమ్రా రీఎంట్రీ విషయంలో.. ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడించాం. బుమ్రా పనిభారాన్ని క్రమంగా పెంచడానికి అది మాకు వీలుపడింది''
''కానీ షమి విషయంలో అలా కాదు. ఇది టెస్టు క్రికెట్. అక్కడ సుదీర్ఘ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. దీంతో దశల వారీగా షమితో పనిచేయాలి. ఆస్ట్రేలియా పర్యటననే అంతిమ లక్ష్యం'' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అక్టోబర్-నవంబర్లో మెల్బోర్న్లో జరిగే ఇండియా-ఏ మ్యాచ్ల్లో షమిని బరిలోకి దించేలా బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై షమికి మెరుగైన రికార్డు ఉంది. ఎనిమిది టెస్టులు ఆడిన అతను 32 సగటుతో ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు అయిదు వికెట్లు తీశాడు. అందుకే షమి విషయంలో బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
కాగా, నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.