హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను టీమిండియా బుధవారం వీక్షించింది. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు క్రికెటర్లందరూ హాజరయ్యారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారత ఆటగాళ్లకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ఆత్మీయులు, సన్నిహితులు ఇలా సచిన్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ కళకళలాడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవువడ్ నటి అనుష్క శర్మ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఉబెర్ చిక్ స్లేట్ గ్రే జంప్ సూట్లో అనుష్క, సరికొత్త హెయిర్ స్టయిల్లో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ బయల్దేరే ముందు భారత ఆటగాళ్లు సచిన్ సినిమాని వీక్షించారు. ఈ సందర్భంగా టీమిండియా మొత్తం ఒక్క చోట చేరి ఆటపాటలతో సందడి చేసింది.
యువరాజ్ సింగ్ తన డ్యాన్స్లతో అక్కడ ఉన్న అందర్ని ఆకట్టుకోగా, ధోని, సచిన్ల ముచ్చట్లు హైలెట్గా నిలిచాయి. బ్లాక్ సూట్లో సచిన్, పింక్ డ్రెస్లో అంజలి మెరిసిపోయారు. అంతేకాదు ఈ సినిమా ప్రత్యేక షోకు వచ్చిన అందరికీ సచిన్ జోడీ ఆత్మీయస్వాగతం పలికింది.