
ప్లేఆఫ్స్లోకి గ్రాండ్ ఎంట్రీ..
ఇవాన్ మోర్గాన్ సారథ్యంలోని కోల్కత నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్లోకి గ్రాండ్గా అడుగు పెట్టింది. టైటిల్ హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ అవకాశాలను కొల్లగొట్టింది. ఆ జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించడానికి ఏ మాత్రం వీల్లేని విజయాన్ని సాధించింది. గురువారం రాత్రి షార్జా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిత్తుచిత్తుగా ఓడించింది. తన ఖాతాలో 14 పాయింట్లను వేసుకోగలిగింది. భారీ తేడాతో విజయం సాధించడం వల్ల నెట్ రన్రేట్ను కూడా అదే స్థాయిలో మెరుగుపర్చుకోగలిగింది.

86 పరుగుల భారీ తేడా..
తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్.. 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం తన ప్రత్యర్థిని 85 పరుగులకే కట్టడి చేసింది. 86 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలవడం వల్ల నైట్ రైడర్స్ నెట్ రన్రేట్ మరింత పటిష్ఠంగా తయారైంది. చెక్కు చెదరని స్థాయికి చేరింది. దీని ప్రభావం- ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలపై తీవ్రంగా పడింది. ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబై ఇండియన్స్.. తన చిట్టచివరి లీగ్ మ్యాచ్లో ఓ అద్భుతాన్నే చేయాల్సిన పరిస్థితిని కల్పించింది. టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ తీసుకుని, 200లకు పైగా పరుగులు చేయడం, ప్రత్యర్థిని 171 పరుగుల తేడాతో ఓడించడం వంటి అద్భుతాలు జరిగితే తప్ప ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరుకోలేదు.

రోహిత్ శర్మకు చేదు అనుభవం..
బలమైన ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ సారి ప్లేఆఫ్స్లో అడుగు పెట్టలేకపోయింది. కిందటి సీజన్ వరకూ రోహిత్ సేనదే ఆధిపత్యం. ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలను సాధించింది. ప్లేఆఫ్స్లో దర్జాగా అడుగు పెట్టింది. ఆ తరువాత ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. వరుస విజయాలతో టైటిల్ను ఎగరేసుకెళ్లింది. అయిదుసార్లు ఛాంపియన్గా నిలిచింది ముంబై. ఇప్పుడు మాత్రం ఆ దూకుడును కొనసాగించలేకపోయింది.

ఆరో స్థానంలో
ముంబై ఇండియన్స్- టైటిల్ హాట్ ఫేవరెట్స్లో ఒకటి.. గత సీజన్ ఛాంపియన్. అయిదుసార్లు ఐపీఎల్ టైటిల్ను అందుకున్న ఏకైక ఫ్రాంఛైజీ ఇదొక్కటే. ఇప్పుడు కూడా తనదైన మార్క్ విక్టరీలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుందని ఆశించారంతా. అలాంటివేవీ చోటు చేసుకోలేదు. రోహిత్ సేన దూకుడు తగ్గింది. ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచుల్లో ఏడింట్లో ఓడిపోయింది. 12 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఇంత లోయర్ పొజీషన్కు చేరుకున్న సందర్భాలు చాలా తక్కువ.

రోహిత్ శర్మకు చేదు అనుభవం..
ఈ సీజన్.. ప్రత్యేకించి ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మకు ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చినట్టయింది. త్వరలోనే టీమిండియా కేప్టెన్గా పగ్గాలను అందుకోనున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్ ఆడే భారత క్రికెట్ జట్టుకు కాబోయే కేప్టెన్ అతను. ముంబై ఇండియన్స్ను సమర్థవంతంగా నడిపించడం, ఆ జట్టును అయిదుసార్లు ఛాంపియన్గా నిలబెట్టడాన్ని చూసే అతనికి టీ20 ఫార్మట్ పగ్గాలను అప్పగించాలని నిర్ణయించుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.

మెరుపులు ఏమయ్యాయ్..
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఏ మాత్రం కూడా మెరుపులు మెరిపించలేక పోయింది. సీజన్ ఆరంభం నుంచీ ఆ జట్టు తప్పటడుగులు వేస్తూనే వస్తోంది. భారత గడ్డపై జరిగిన మ్యాచుల్లోనూ గొప్ప విజయాలనేవీ సాధించలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు టోర్నమెంట్ షిఫ్ట్ అయిన తరువాత కూడా దాని తలరాత పెద్దగా మారలేదు. ఇదే ఎమిరేట్స్ గడ్డపై గత ఏడాది టైటిల్ విన్నర్గా టోర్నమెంట్ మొత్తంపైనా తన ఆధిపత్యాన్ని కనపరిచిన ముంబై ఇండియన్స్ టీమ్ ఇప్పుడు చేతులు ఎత్తేసింది.

టీ20 వరల్డ్ కప్ తరువాత..
ఇంకొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత విరాట్ కోహ్లీ.. కేప్టెన్గా వైదొలగబోతున్న విషయం తెలిసిందే. టీ20 పార్మట్లో ఆడే టీమిండియాకు రోహిత్ శర్మ కేప్టెన్గా వ్యవహరిస్తాడు. దీనిపై ఇప్పటికే విరాట్ ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశాడు. తన వారసుడిగా రోహిత్ శర్మ పేరును సూచించాడు కూడా. పట్టాభిషేకానికి దాదాపుగా ముహూర్తం కూడా ఖరారైన ప్రస్తుత పరిస్థితుల్లో- ముంబై ఇండియన్స్ను ప్లేఆఫ్స్కు కూడా చేర్చలేకపోవడాన్ని ఓ అశుభ సూచకంగానే పరిగణించవచ్చు.

అన్నింట్లోనూ వైఫల్యం..
ఎమిరేట్స్లో సెకెండ్ హాఫ్ సీజన్ మొదలయ్యే సమయానికి పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో కనిపించింది. లీగ్ దశ మ్యాచులు ముగిసే సమయానికి ఆ పరిస్థితి లేదు. ముంబై ఇండియన్స్ స్థానాన్ని కోల్కత నైట్ రైడర్స్ ఆక్రమించేసుకుంది. రోహిత్ సేనను ఆరో స్థానానికి నెట్టేసింది. టాప్ ఫైవ్లోనూ నిలవలేదు.. రోహిత్ అండ్ హిస్ టీమ్. ఈ సాయంత్రం అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో తన చిట్ట చివరి లీగ్ మ్యాచ్ను ఆడనుంది ముంబై. సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటుందేమో గానీ ప్లేఆఫ్స్లో మాత్రం అడుగు పెట్టలేదు.

లోపాలు సరిచేసుకోవడానికి అవకాశంగా..
టీమిండియా టీ20 ఫార్మట్ కేప్టెన్గా బాధ్యతలను స్వీకరించనున్న సమయంలో అదే ఫార్మట్లో తన సారథ్యంలోని ముంబై ఇండియన్స్ను ప్లేఆఫ్స్కు చేర్చేలకపోవడం రోహిత్ శర్మ వైఫల్యంగానే భావించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఓటమి- అతని కేప్టెన్సీపై ప్రభావం చూపుతుందనే వారూ లేకపోలేదు.తాను చేసిన పొరపాట్లు, తప్పులను గుర్తించి.. సరిచేసుకోవడానికి పరాజయాల రూపంలో ఓ అవకాశం లభించినట్టయిందనే వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి.


Click it and Unblock the Notifications
