న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. తీవ్ర నీటి సమస్యతో ఇప్పటికే మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అంశం కోర్టుదాకా వెళ్లింది. తాజాగా ప్రముఖ వ్యాఖ్యాత(కామెంటేటర్) హర్షా భోగ్లేపై బీసీసీఐ అనూహ్యరీతిలో వేటువేసింది.
హర్షా భోగ్లే కామెంటేటింగ్ కాంట్రాక్టును బోర్డు ఉన్నపళంగా రద్దుచేసింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటర్లపై.. ప్రధానంగా హర్షా భోగ్లేను ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కామెంట్లుకూడా వేటుకు బలమైన కారణమని తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా కామెంటేటర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలను సేకరిస్తోన్న బీసీసీఐ.. అదే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కారణంగా హర్షా భోగ్లేపై వేటు వేసినట్లు ఓ అధికారి చెప్పారు. కామెంట్రీపై ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభమైన రోజే హర్షాను కామెంటేటర్ల ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హర్షా కూడా తాను ఇకపై ఐపీఎల్కు అందుబాటులో ఉండబోనంటూ ట్వీట్ చేశారు.
కాగా, టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా, బంగ్లాదేశ్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇండియన్ కామెంటేటర్లు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి.
ఇలా పలు కారణాలను బేరిజు వేసుకున్న తర్వాత హర్షాకు షాక్ ఇవ్వాల్సిందేనని ఫిక్సైన బీసీసీఐ ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో శని, ఆదివారాలనాటి మ్యాచ్లకు భోగ్లే అందుబాటు ఉండరు. అయితే ఈ వేటు టోర్నీ మొత్తం కొనసాగుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది.