కొలంబో: పేలవ ఫామ్తో ఇబ్బందిపడుతున్న శ్రీలంక పేసర్ లసిత్ మలింగ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఊగిసలాడుతున్నాడు. తనవల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు తప్పుకోవడమే బెటర్ అంటూ మలింగ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. రిటైర్మెంట్ కే అతను మొగ్గుచూపుతున్నాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ తో ఆడిన నాలుగు మ్యాచుల్లోను మలింగ కేవలం 2వికెట్లు మాత్రమే తీయగలిగాడు. సిరీస్ లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండటంతో.. ఆ మ్యాచ్ అనంతరం తన భవిష్యత్ ప్రణాళిక గురించి వెల్లడిస్తానని మలింగ పేర్కొన్నాడు. గురువారం జరిగిన నాలుగో వన్డే అనంతరం మలింగ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'భారత్తో వన్డే సిరీస్ అనంతరం నా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తా. గాయం కారణంగా సుమారు 19 నెలల తర్వాత జట్టులోకి వచ్చాను. జింబాబ్వే, భారత్ సిరీస్ల్లో నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా. భారత్తో సిరీస్ తర్వాత కెరీర్పై నిర్ణయం తీసుకుంటా. జట్టులో కొనసాగాలంటే అనుభవం పనికిరాదు. జట్టు అవసరాల కోసం, విజయం కోసం ఆడాలి, కష్టపడాలి. అలా చేయలేని సమయంలో ఏం చేయాలి?' అని మలింగ పేర్కొన్నాడు.
మున్ముందు ఇంకెన్ని గేమ్స్ ఆడుతానో వేచి చూడాలని మలింగ అన్నాడు. బౌలింగ్ కు తన శరీరం సహకరించకపోతే ఎవరు మాత్రం తన నుంచి ఏం ఆశిస్తారని, అదే జరిగితే రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకు పెద్ద అనుభవం లేదని, ఇప్పటినుంచి వాళ్లు అవకాశాలు వస్తే.. 2019 ప్రపంచకప్ నాటికి కనీసం 30-50వన్డేలు ఆడిన అనుభవం వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కాగా, ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య చివరి వన్డే ఈ నెల 3న జరగనుంది. శ్రీలంకలో భారత్ టూర్ ముగుస్తుండటంతో లంక ఆటగాడు మలింగ శుక్రవారం రాత్రి తన ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈ విందుకు భారత ఆటగాళ్లు హాజరయ్యారు. మలింగ ఇంట్లో విందులో పాల్గొన్న సమయంలో దిగిన ఫొటోలను శిఖర్ధావన్, రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విందు కార్యక్రమంలో శ్రీలంక ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు.