న్యూఢిల్లీ: ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసింది. సెమీఫైనల్లోనే భారత క్రికెట్ జట్టు జైత్రయాత్రకు పుల్స్టాప్ పడింది. ఇక వాట్ నెక్స్ట్?. టీమిండియా త్వరలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో మూడు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా సహా అంటిగ్వా, జమైకా, గయానా, ట్రినిడాడ్లలో ఈ మ్యాచ్లను నిర్వహిస్తుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
కాగా, భారత జట్టులోని కొందరు సీనియర్ క్రికెటర్లు ఈ సిరీస్కు డుమ్మా కొట్టబోతున్నారు. వెస్టిండీస్ సిరీస్కు ముందే సుదీర్ఘ విశ్రాంతిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కేప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ సిరీస్లో ఆడట్లేదు. తమకు విశ్రాంతి కావాలని కోరుతూ వారు ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి లేఖ రాశారు. అనుమతి కూడా తీసుకున్నారు. తాజాగా- మరికొందరు క్రికెటర్లు ఈ సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మహేంద్ర సింగ్ ధోనీ ఈ సిరీస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానమే. ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తరువాత తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతానని ధోనీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరో ఏడాది లేదా రెండేళ్ల పాటు క్రికెట్ ఆడాలనే ఆలోచనలో ధోనీ ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.