ముంబై: భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది! వారం రోజుల పాటు క్రికెటర్లకు సెలవు ఇచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్లో భారత్ ఏమాత్రం రాణించలేదు. ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో త్వరలో ప్రపంచ కప్ 2015 ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో వరుసగా ఒత్తిడి ఉండకుండా ఉండేందుకు బీసీసీఐ వారికి హాలీడేస్ ఇచ్చింది. సుదీర్ఘ షెడ్యూలుతో ఇంటికి దూరమైన ఆటగాళ్లకు వెళ్లేందుకు అనుమతించింది. కుటుంబంతో, స్నేహితులతో వారు వారం రోజుల పాటు ఆహ్లాదంగా గడపవచ్చు.

కొద్ది రోజుల క్రితం మాజీ సారథి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ఆటగాళ్లను కొద్ది రోజుల పాటు ఇంటికి పంపించాలని సూచించాడు. కాగా, బీసీసీఐ నిర్ణయంతో అందరికంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ ఆనందంగా ఉండి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అనుష్క శర్మ, కోహ్లీ మధ్య ఉన్న రిలేషన్ తెలిసిందే.
మరోవైపు, ధోనీ తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన తన చిన్ననాటి సహచరి సాక్షిని 2010 జులైలో ధోనీ వివాహం చేసుకున్నాడు. అప్పట్నుంచి ధోనీతోపాటు టీమిండియా విదేశీ పర్యటనల్లో ఆమె కనిపించింది. స్టేడియంలో కూర్చుని అతడ్ని ఉత్సాహపరుస్తూ కేరింతలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.