
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత్ తయారు చేసిన పిచ్లపై ఐసీసీ పెదవి విరిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచులు జరిగిన నాగ్పూర్, ఢిల్లీ పిచ్లకు 'యావరేజ్' రేటింగ్ ఇచ్చిందట. ఈ రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ పిచ్లపై తొలి సెషన్ నుంచే పిచ్ స్పిన్నర్లుకు సహకరించిన సంగతి తెలిసిందే. ఈ రెండు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు ఈ సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది.
రెండు మ్యాచుల్లో కూడా సెకండ్ ఇన్నింగ్సులో బ్యాటింగ్ చేయడానికి ఆస్ట్రేలియా చాలా కష్టపడింది. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఢిల్లీలో అయితే 91 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ టెస్టు మూడో రోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోవడం గమనార్హం. వీటిలో చాలా మంది బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి అవుటవడం తెలిసిందే. ఇంతలా స్పిన్కు సహకరించిన పిచ్కు ఐసీసీ అంపైర్ 'యావరేజ్' రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్లో గతేడాది బెంగళూరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పిచ్కు నెగిటివ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది.
అదే భారత పిచ్కు చివరగా దొరికిన నెగిటివ్ రేటింగ్. ఇక్కడ జరిగిన పింక్ బాల్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. దీనికి 'బిలో యావరేజ్' రేటింగ్ దక్కింది. అంతకుముందు 2017లో ఆస్ట్రేలియాతో పూణేలో ఆడిన పిచ్కు 'పూర్' రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ను 100 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్ మ్యాచ్ గెలిచింది. ఈ పిచ్కు ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పూర్ రేటింగ్ ఇచ్చాడు. ఆసీస్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పిచ్కు యావరేజ్ రేటింగ్ దక్కడంతో మూడో టెస్టుపై అందరి దృష్టి పడింది. బ్యాటింగ్కు అనుకూలించే హోల్కార్ స్టేడియంలో ఎలాంటి పిచ్ తయారు చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.