
గేట్లు ఎత్తేస్తున్నా చర్యలేవి
నిన్నటి మ్యాచ్లో భువీ తన స్పెల్లో 4ఓవర్లలో ఏకంగా 52పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతనికి జతగా మిగతా బౌలర్లు చాహల్ 3.2ఓవర్లలో 42, హర్షల్ పటేల్ 4ఓవర్లలో 49పరుగులు సమర్పించుకున్నారు. ఉమేష్ యాదవ్ 2ఓవర్లలో 27పరుగులిచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2ఓవర్లలో 22రన్స్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ 4ఓవర్లలో 17పరుగులే ఇచ్చి 3వికెట్లు తీసి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. భారత బౌలర్లు డెత్ ఓవర్లయిన 17, 18, 19ఓవర్లలో 15, 22, 16 పరుగులు వరుసగా సమర్పించుకున్నారు. హర్షల్ పటేల్ 18వ ఓవర్లో మూడు సిక్సులతో సహా 22పరుగులిచ్చి మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. ఇకపోతే గత కొంతకాలం భారత జట్టు పేసర్లలో హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువీ పలు మ్యాచ్లలో గేట్లు ఎత్తేస్తున్నా టీమిండియా జట్టు మేనేజ్ మెంట్ సరైన చర్యలు చేపట్టడం లేదు. ఆసియాకప్లో రెండు మ్యాచ్లలో 19వ ఓవర్ వేసిన భువీ భారీగా పరుగులిచ్చినట్లే ఈ మ్యాచ్లోనూ ఇచ్చాడు.

ఆ ముగ్గురిది వరస్ట్ ప్రదర్శన
ఇక టీమిండియా సెటప్లో 2022లో టీ20లు ఆడిన భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్.. కొద్దో గొప్పో వికెట్లు తీసిన కీలక మ్యాచ్లలో మాత్రం భారీగా రన్స్ లీక్ చేస్తున్నారు. ఒక్క ఏడాదిలో అత్యధిక సార్లు టీ20ల్లో 40ప్లస్ పరుగులు ఇచ్చిన బౌలర్లుగా ఈ ముగ్గురు నిలిచారు. ఈ ముగ్గురు 2022లోనే వరస్ట్ ప్రదర్శన కనబరిచారు. హర్షల్ పటేల్ 5సార్లు, అవేశ్ ఖాన్ 4సార్లు, భువనేశ్వర్ కుమార్ 4సార్లు 40ప్లస్ పరుగులు ఇచ్చారు. వీరి ప్రదర్శన నోటీస్ చేయాల్సిన అవసరముంది. భువీ పవర్ ప్లేలో బానే బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. డెత్ ఓవర్లలో మాత్రం తేలిపోతున్నాడు. హర్షల్ పటేల్ది సైతం అదే పరిస్థితి. అవేశ్ ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్కు అసలు స్కీంలో కూడా లేని ఉమేష్ యాదవ్ను తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక బౌలింగ్ విభాగం, ఫీల్డింగ్ విభాగంలో టీం తప్పకుండా చర్యలు చేపట్టాల్సిన తరుణమొచ్చింది.

భారత జట్టుకు అంతులేని పేస్ ఆప్షన్లు
భారత జట్టు మేనేజ్ మెంట్, సెలెక్షన్ కమిటీ జట్టు కూర్పు విషయంలో స్టార్లకు పెద్ద పీట వేస్తూ.. జట్టు సమతూకాన్ని విస్మరిస్తుందనే అభియోగాలు బానే వస్తున్నాయి. అవకాశాలివ్వాలనే పేరిట మ్యాచ్లు ఓడిపోవడాన్ని కూడా సింపుల్ విషయంగా తీసుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. జట్టు ఓడుతున్నా ప్లేయర్లు మాత్రం కొన్ని మ్యాచ్లలో మ్యాచ్ అనంతరం నవ్వుతూ, జోకులేసుకుంటూ కన్పిస్తుండడం బట్టి కూడా సీరియస్ నెస్ మిస్సయిందా అనే అనుమానాలున్నాయి. సీనియర్లతో నిండిపోయిన టీమిండియా.. యువ ప్లేయర్లను గాలికొదేస్తుందనే విషయం అర్థమవుతుంది. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, మోహ్సిన్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసీద్ క్రిష్ణ, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమంది పేసర్లు ఉన్నా.. ఎందుకు జట్టు సెలెక్షన్ విషయంలో సమతూకం రావట్లేదో అంతుపట్టడం లేదు.


Click it and Unblock the Notifications












