
హైదరాబాద్: కోల్కతా టెస్టులో తన క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్నానని శ్రీలంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ అన్నాడు. భారత పేసర్లు మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్పై చండీమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఓ స్పోర్స్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో దినేశ్ చండీమాల్ మాట్లాడుతూ 'తొలి టెస్టులో చివరి ఓవర్లు ఉత్కంఠకు గురిచేశాయి. చివరకు ఓటమి నుంచి తప్పించుకున్నాం. కోల్కతా టెస్టుని ఓడకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం. మరితం సమయం ఉంటే కచ్చితంగా లక్ష్యాన్ని సాధించేవాళ్లం' అని అన్నాడు.
'వెలుతురులేమి కారణంగా మ్యాచ్ 25 ఓవర్లు మాత్రమే జరుగుతుందని తెలుసు. అందుకే డ్రా కోసం ప్రయత్నించాం. మా గేమ్ ఆడేందుకు ప్రయత్నించాం. అయితే షాట్ సెలక్షన్ సరిగ్గా లేకపోవడంతో త్వరత్వరగా వికెట్లు కోల్పోయాం. ఒత్తిడిలో కూడా జట్టులోని ఆటగాళ్లు చక్కగా రాణించారు' అని తెలిపాడు.
'ఈ మ్యాచ్లో నేను నా క్రికెట్ కెరీర్లోనే బెస్ట్ బౌలర్లును ఎదుర్కొన్నాను. భారత్కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. వీరు ప్రపంచంలోనే మేటి బౌలర్లు. భారత జట్టులో కోహ్లీ ప్రధాన బ్యాట్స్మెన్. అతని వీలైనంత త్వరగా ఔట్ చేయాలని జట్టు సమావేశాల్లో అనుకునేవాళ్లం' అని పేర్కొన్నాడు.
'కానీ ఆటలో చివరి రోజు మాకు ఆ అవకాశం రాలేదు. కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. మ్యాచ్లో మంచి షాట్లు ఆడాడు' అని తెలిపాడు. కాగా డిక్వెల్లా కావాలనే సమయం వృథా చేశాడంటూ వస్తున్న వార్తలపై కూడా చండీమాల్ స్పందించాడు.
'అలాంటిదేమీ లేదు. డిక్వెలా సవాళ్లను ఇష్టపడతాడు. అతను తప్పుగా ఏమి ప్రవర్తించలేదు. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవల్సిన అవసరం లేదు' అని అన్నాడు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభం కానుంది.