ఒకప్పుడు ఐపీఎల్లో కోట్ల ధర.. నేడు బ్యాంకులో నౌకరీ చేస్తున్న కోహ్లీ దోస్త్!
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం చాలా మంది ప్లేయర్లు కోచింగ్ ఇవ్వడమో లేదా కామెంట్రీ బాక్సులో సెటిల్ అవ్వడమో చేస్తుంటారు. మరికొందరు మాజీ ఆటగాళ్ల కోసం జరిగే లెజెండ్స్ లీగ్స్ ఆడుతూ బిజీగా గడుపుతారు. కానీ ఒకప్పటి స్టార్ ఇండియన్ క్రికెటర్ మాత్రం వీరందరికీ భిన్నంగా రిటైర్మెంట్ తర్వాత మరీ లగ్జరీ లైఫ్ వైపు వెళ్లకుండా.. ఓ సాధారణ ఉద్యోగాన్ని ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఆ ఆటగాడు మరెవరో కాదు.. స్పీడ్ స్టర్ సిద్ధార్థ్ కౌల్.
సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ చాలా కాలం సాగకపోయినప్పటికీ.. ఆడిన కొద్ది రోజుల్లోనే తన స్వింగ్ బౌలింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్లో మెరిసిన తర్వాత సిద్ధార్థ్ కౌల్కు టీమిండియా సీనియర్ జట్టులోనూ అవకాశం వచ్చింది. ఇండియా తరపున సిద్ధార్థ్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడాడు. అయితే జట్టులో తీవ్రమైన పోటీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో చివరకు అతను 2024లో అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సిద్ధార్థ్ కౌల్ తన జీవితంలో సరికొత్త సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్లో పంజాబ్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈ మాజీ పేసర్.. ప్రస్తుతం చండీగఢ్లోని 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' బ్రాంచ్లో సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మంది క్రికెటర్లు గ్లామర్ ఫీల్డ్ను ఎంచుకుంటే.. సిద్ధార్థ్ మాత్రం బ్యాంకు ఉద్యోగంలో చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరాడంబరంగా సాగుతున్న సిద్ధార్థ్ కౌల్ బ్యాంకింగ్ లైఫ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు అభినందిస్తున్నారు.
టీమిండియాలో ఎక్కువ ఛాన్సులు రాకపోయినా.. ఐపీఎల్లో మాత్రం సిద్ధార్థ్ కౌల్ హవా నడిచింది. కోట్ల రూపాయల ధర పలికిన బౌలర్గా సిద్ధార్థ్ కౌల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ అతన్నిరూ.20 లక్షలకు కొనుగోలు చేసింది కానీ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు అతన్ని ఏ జట్టు తీసుకోలేదు. 2013లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు, 2014లో రూ.45 లక్షలకు సిద్ధార్థ్ను దక్కించుకుంది. ఆ తర్వాత అతను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వెళ్లాడు. అక్కడ మొదట రూ.20 లక్షలే ఉన్నా.. 2018 మెగా వేలంలో సన్రైజర్స్ ఏకంగా రూ.3.80 కోట్ల భారీ ధరతో అతన్ని అంటిపెట్టుకుంది.
2021 వరకు భారీ ధరతో హైదరాబాద్కే ఆడిన సిద్ధార్థ్, ఆ తర్వాత 2022, 2023 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఆర్సీబీ అతన్ని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టమైన బౌలర్లలో ఒకడిగా సిద్ధార్థ్ పేరు తెచ్చుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 55 మ్యాచ్లు ఆడిన సిద్ధార్థ్ కౌల్.. 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్లో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం అతని బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన. ఒకప్పుడు కోట్ల రూపాయల వేలం పాటతో ఐపీఎల్ స్టేడియంలను హోరెత్తించిన ఈ క్రికెటర్.. నేడు బ్యాంకు కౌంటర్ వెనుక కూర్చొని విధుల్లో మునిగిపోవడం నిజంగా విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications