చండీగఢ్: పంజాబ్కు చెందిన ఫాస్ట్ బౌలర్ మన్ప్రీత్ గోని క్రికెట్కు గుడ్బై చెప్పారు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తాను తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖను ఆయన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు పంపించారు. వెంటనే ఈ లేఖను ఆమోదించాలని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో పలు ఫ్రాంఛైజీల తరఫున ఆడిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే- 2008 ఆసియాకప్ టోర్నమెంట్లో పాకిస్తాన్పై రెండు అంతర్జాతీయ వన్డే మ్యాచ్లను కూడా ఆడారు. అనంతరం తెరమరుగు అయ్యారు.
ఐపీఎల్ ఆరంభమైన తొలి సీజన్లలో పలు ఫ్రాంఛైజీల తరఫున మన్ప్రీత్ గోని ఆడారు. చెన్నై సూపర్కింగ్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, దక్కన్ ఛార్జర్స్ జట్ల తరఫున ఐపీఎల్లో పలు మ్యాచ్లను ఆడారు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మట్లలో మొత్తం 206 మ్యాచ్లను ఆడిన గోని.. 369 వికెట్లను పడగొట్టారు. చివరిసారిగా గోని.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచుల్లో ఆడారు. అయిదు మ్యాచుల్లో అయిదు వికెట్లను పడగొట్టి, ఫర్వాలేదనిపించుకున్నారు.
బౌలర్.. లేబర్లాంటోడు: బౌలింగ్ చేయాలని ఎవరూ కోరుకోరు
గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్లో ఆడటానికి వీలుగా ఆయన జాతీయ, అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది. జులై 25వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. ఇందులో ఆడటానికి ఇప్పటికే యువరాజ్ సింగ్ సిద్ధం అయ్యారు. యువరాజ్ సింగ్ సహా పలువురు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్ మ్యాచుల్లో ఆడనున్న విషయం తెలిసిందే. టోరంటో నేషనల్స్ టీమ్ ఆయనను జట్టులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.