టీ20 వరల్డ్ కప్-2024లో పాకిస్థాన్పై అమెరికా సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ పోరులో మాజీ ఛాంపియన్ పాక్ను యూఎస్ఏ ఆల్రౌండ్ షోతో మట్టికరిపించింది. అయితే ఈ గెలుపులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లదే కీలక పాత్ర కావడం విశేషం. జట్టును గెలిపించిన కెప్టెన్ మోనాంక్ పటేల్, బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ ఇండియాలోనే జన్మించారు.
సూపర్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికాను గెలిపించిన సౌరభ్ ముంబైలో పుట్టాడు. రంజీ ట్రోఫీలో ఆడాడు. అంతేగాక 2010 అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ, జయదేవ్ ఉనద్కత్తో కలిసి ఆడాడు. అయితే అండర్-19 ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఆ మ్యాచ్లో అయిదు ఓవర్ల బౌలింగ్ వేసిన సౌరభ్ 16 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. 14 ఏళ్ల తర్వాత అమెరికా తరఫున పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీలో అదరగొట్టిన మోనాన్క్ పటేల్ గుజరాత్లో జన్మించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ను ఓడించిన భారత సంతతి ప్లేయర్లు సౌరభ్, మోనాంక్ పటేల్ గురించి నెట్టింట పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ సౌరభ్, మోనాంక్ గురించి ఆసక్తికర పోస్టులు పెట్టింది. సౌరభ్ను ఉద్దేశిస్తూ.. '14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ను ఓడించాడు', మెనాన్క్ గురించి.. 'వరల్డ్ కప్లో పాకిస్థాన్తో మ్యాచ్ అంటే గుజరాత్ ఆటగాళ్లు చెలరేగుతారు' అని ఎల్ఎస్జీ పోస్ట్ చేసింది. యూఎస్ఏ జట్టులో ఏకంగా ఆరుగురు మనోళ్లే ఉన్నారు. మోనాంక్, సౌరభ్తో పాటు హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీశ్ కుమార్ కూడా మనోళ్లే.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెంజిగె (3/30), సౌరభ్ (2/18) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. సారథి మొనాన్క్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించాడు.
స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ పోరులో మొదట యూఎస్ఏ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. అయితే మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లయ తప్పి ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నాడు. అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్ నేత్రావల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.