
పూణే: సెంచరీ.. ఏ బ్యాట్స్మన్కు అయినా ఓ అరుదైన ఘనత. ఫార్మాట్ ఏదైనా ప్రతిఒక్క బ్యాట్స్మన్ శతకం భాధాలని చూస్తాడు. అయితే అది అంత సులభం మాత్రం కాదు. సుదీర్ఘంగా క్రీజులో నిలబడి ఆడాల్సి ఉంటుంది. బౌలర్, పిచ్, వాతావరణం, ఒత్తిడిని అధిగమించి బ్యాట్స్మన్ పరుగులు చేస్తేనే సెంచరీ మార్క్ అందుకుంటాడు. 100 శతకాలు బాదిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా.. 90ల్లోకి వచ్చాక తడబడేవాడు. ఒత్తిడిని జయించలేక ఎన్నోసార్లు 90ల్లో పెవిలియన్ చేరాడు. తాజాగా టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇలానే ఔట్ అయ్యాడు.
ఇంగ్లండ్తో పుణె వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్లో 18వ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 95 పరుగులు చేసినప్పటి నుంచి పరుగులు చేయడానికి కష్టపడిన గబ్బర్.. మరో మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ స్లో బంతిని పుల్ షాట్ ఆడబోయి షార్ట్ మిడ్ వికెట్లో ఇయాన్ మోర్గాన్కు క్యాచ్గా చిక్కాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్.. సెంచరీకి చేరువలో ఒత్తిడిలోనయ్యాడు. 100 మార్క్ చేరే క్రమంలో నిదానంగా ఆడి వికెట్ చేజార్చుకున్నాడు.
శిఖర్ ధావన్ ఓపెనర్గా వచ్చి తొంబైల్లో అవుట్ కావడం ఇది ఐదోసారి. ఇలా వన్డే క్రికెట్లో అత్యధికసార్లు తొంబైల్లో ఔటైన టీమిండియా ఓపెనర్ల జాబితాను పరిశీలిస్తే.. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. సచిన్ ఏకంగా 16 సార్లు తొంబైల్లో పెవిలియన్ చేరారు. సచిన్ తర్వాతి స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దాదా ఆరుసార్లు ఇలా తొంబైల్లో అవుటయ్యాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఐదుసార్లు తొంబైల్లో ఔటయ్యారు. గబ్బర్ కూడా ఐదుసార్లు ఔట్ అయ్యాడు.
అత్యధికసార్లు తొంబైల్లో ఔటైన భారత ఓపెనర్లు:
సచిన్ టెండూల్కర్-16
సౌరవ్ గంగూలీ-6
వీరేంద్ర సెహ్వాగ్-5
శిఖర్ ధావన్-5