
హైదరాబాద్: భారత్-శ్రీలంకకు జరిగిన టెస్ట్ మ్యాచ్లో జరిగిన ఇబ్బందులు అంతాఇంతా కాదు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది, కొంతమందికి వాంతులు రావడం లాంటివి తలెత్తాయి. అయితే ఈ ఘటనలపై స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బీసీసీఐ కు లేఖ రాసింది. అందులో పరిగణనలో తీసుకోవాల్సిన గురించి పేర్కొంది.
'వాయు కాలుష్యం కారణంగా దిల్లీలో భారత్-శ్రీలంక మధ్య నిర్వహించిన మ్యాచ్లో సమస్యలు తలెత్తాయి. గత కొద్ది రోజులుగా దిల్లీలోని ఎన్సీఆర్ రీజియన్లో గాలిలో ఆక్సిజన్ స్థాయులు చాలా వరకు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఆటగాళ్లు ఆడటం వల్ల వూపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి ప్రాణానికి ముప్పు రావొచ్చు. క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రదర్శన చేయలేరు. మీరు ఎలాగైతే మ్యాచ్లు నిర్వహించే ముందు వర్షం, వెలుతురు లేమి సమస్యలను పరిగణలోనికి తీసుకుంటారో ఇక నుంచి గాలి నాణ్యతపై కూడా దృష్టి పెట్టండి. గాలి నాణ్యత సరిగా లేకపోతే అక్కడ మ్యాచ్ నిర్వహించొద్దు' అని ఐఎంఏ లేఖలో పేర్కొంది.
వర్షం, వెలుతురు సమస్యలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్లు నిర్వహించే బీసీసీఐ ఇక నుంచి గాలి నాణ్యతను పరిగణనలోనికి తీసుకోవాలని దీని ఆంతర్యం. దిల్లీలో నిర్వహించిన టెస్టు మ్యాచ్లో శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసినంతసేపు మాస్కులు ధరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆటగాళ్లు తాము ఇక ఆడలేమని అంపైర్లకు తెలిపారు. ఐసీసీ నిబంధనలకు విరుద్ధుంగా మ్యాచ్ను నిలిపివేయలేమని వారు చెప్పడంతో మ్యాచ్ యథావిధిగా కొనసాగించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.