Pakistan: పాకిస్థాన్ లో జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ 2025లో మరో వివాదం తలెత్తింది. భద్రతా సిబ్బంది ఒక ప్రేక్షుకుడిని స్టేడియం నుంచి బయటకు లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అభిమాని లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో భారత్ జెండాను ఊపాడని తెలిసింది. ఈ సంఘటన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది. అంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు కేవలం ఒక రోజు ముందు జరిగింది. ఇదిలా ఉండగా.. రావల్పిండి స్టేడియంలో న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్బంగా ఒక ప్రేక్షకుడు మైదానంలోకి ప్రవేశించినప్పుడు జరిగిన భద్రతా లోపాన్ని కూడా పీసీబీ గమనించింది.
భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్థాన్ లో ఆడడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. భారత్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య జట్టు పాకిస్థాన్ ఇప్పటికే నిష్క్రమించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తోంది. కానీ ఒక వైరల్ వీడియో వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో భద్రతా సిబ్బంది ఓ వ్యక్తిని స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్తున్నారు. ఆ వ్యక్తి లాహోర్ స్టేడియంలో భారత్ జెండాను ఊపాడు. ప్రస్తుతం దీని గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

ఆ వీడియోలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జెండాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ అభిమాని చేతిలో ఉన్నది భారతదేశపు జెండా అవునా కాదా అనేది అధికారికంగా నిర్ధారించలేదు. ఈ సంఘటన భారత్-పాక్ మ్యాచ్ కు కేవలం ఒకరోజు ముందు జరగడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన ఏ స్టేడియంలో జరిగిందో స్పష్టంగా తెలియదు. కానీ సోషల్ మీడియాలో లాహోర్లోని గడాఫీ స్టేడియం పేరు వినిపిస్తోంది. అభిమానిని తీవ్రంగా కొట్టారని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. రావల్పిండి స్టేడియంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భద్రతా లోపాన్ని గమనించింది. ఒక ప్రేక్షకుడు మైదానంలోకి ప్రవేశించాడు. అతడు అరెస్ట్ చేయబడ్డాడు. ఆటగాళ్ల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టులో హాజరపరిచారు. పాకిస్థాన్ లోని అన్ని క్రికెట్ స్టేడియాలలోకి ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి భద్రతా సంస్థలు, స్టేడియం అధికారులతో కలిసి భద్రతా ప్రోటోకాల్ లను పీసీబీ సమీక్షిస్తోంది.