
మాంఛెస్టర్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చాన్నాళ్ల తరువాత కనిపిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్లో చురుగ్గా కదులుతున్నారు. మునుపటి వేగాన్ని, లయను అందిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ నెట్ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. భువనేశ్వర్ కుమార్ నెట్ ప్రాక్టీస్లో తన పాదాలను కదిపిస్తున్నారు. లైన్ అండ్ లెంగ్త్ను అందుకుంటున్నారు.
ఈ నెల 16వ తేదీన మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌలింగ్ చేస్తుండగా.. కాలి కండరాలు పట్టేశాయి. దీనితో బౌలింగ్ను మధ్యలోనే వదిలేసి ఆయన డ్రెస్సింగ్ రూమ్ దారి పట్టారు. అప్పటి నుంచీ కనిపించలేదు. ఆయన గాయంపైనా పెద్దగా అప్డేట్స్ రాలేదు. కనీసం మూడు మ్యాచ్లకు భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉండబోరని అప్పట్లోనే టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం కిందటి శనివారం సౌతాంప్టన్లోని రోజ్బౌల్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్కు కూడా భువి దూరం అయ్యాడు. టీమిండియా తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 30వ తేదీన బలమైన ఇంగ్లండ్ జట్టుతో ఆడబోతోంది. ఇంగ్లండ్తో మ్యాచ్ నాటికి భువనేశ్వర్ కుమార్ అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. కాగా- భువనేశ్వర్ గాయాన్ని దృష్టిలో ఉంచుకుని టీమ్ మేనేజ్మెంట్ స్టాండ్ బై బౌలర్గా ఉన్న నవ్దీప్ షైనీని ఇంగ్లండ్కు పిలిపించుకున్న విషయం తెలిసిందే.